గ్రామ వాలంటీర్లు డబ్బులు వసూలు చేసి ఏం చేస్తున్నారో చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ..ఏపీలో కొత్త చర్చ
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వాలంటీర్లను నియమించి ప్రజలకు మెరుగైన సేవ చేయటానికి సంకల్పించి ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే . ప్రజలకు గవర్నమెంట్ ఆఫీస్ లు చుట్టూ తిరిగే పని లేకుండా చేయటానికి ఆయన ప్రతి గ్రామంలోనూ 50 మందికి ఒక గ్రామ వాలంటీర్ ను నియమించాలని నిర్ణయం తీసుకుని గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు . ఇక ఈ గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే మరోపక్క అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా గ్రామ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చెయ్యటం ఏపీలో కొత్త చర్చకు దారి తీసింది.
గ్రామ వాలంటీర్ల వసూళ్ళ పర్వంపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పధకాలు ప్రజల దగ్గరకి నేరుగా చేరాలని ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి . ఏపీలో గ్రామాల అభివృద్ధికి పట్టం కట్టటం కోసం, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చెయ్యటం కోసం నియమించిన గ్రామ వాలంటీర్లు వసూళ్ళకు పాల్పడుతున్నారని చెప్పిన మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత పార్టీ నేతలపైన ఆరోపణలు గుప్పించారు.
ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే కేసులు పెడతామన్న ఎమ్మెల్యే
గ్రామ వాలంటీర్లు చాలా మంది సంక్షేమ పథకాలు అందించటానికి నిరుపేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇక వారు వాటిని నేతలకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామ వాలంటీర్లకు పని చెయ్యటం ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని , కానీ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని ,కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాలను పొందే లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు ఆరోపణలు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటానికి వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చినా వాలంటీర్ల వసూళ్లతో అది అభాసుపాలవుతుంది . ప్రతి 50 ఇళ్లకు ఒక్కొక్కరి చొప్పున.. మొత్తం 4లక్షల మంది గ్రామ వాలంటీర్లు ఏపీలో సేవలను అందిస్తున్నారు వీరికి ప్రభుత్వం నెలకు రూ.5వేల గౌరవ వేతనం కూడా అందిస్తోంది. కానీ కొందరు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పొందే లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Recommended Video
డబ్బులు వసూలు చేసి నేతలకు ఇస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఇక సర్కార్ గతంలో ఇలాంటి ఆరోపణల క్రమంలోనే కొంతమందిని వాలంటీర్లుగా తొలగించింది. ఇక వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని నిర్ణయించింది . ఇక ఇప్పుడు వారు డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇక వారు వసూలు చేసిన డబ్బులను కొందరు నేతలకు ఇస్తున్నారంటూ సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయంశంగా మారింది .ఇప్పటికే గ్రామ వాలంటీర్ల విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చినట్టుగా ఉన్నాయి.