"నారా చంద్రబాబు కాదు, నయీం చంద్రబాబు.. అంతా అవినీతి అనుసంధానమే"
నెల్లూరు : టీడీపీ పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని పేర్కొంటూ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష వైసీపీ నేతలు. తాజాగా బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు వ్యవహారశైలిపై ఫైర్ అయ్యారు.
సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని.. దీంతో చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారైన పరిస్థితి నెలకొందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం చంద్రబాబు.. నారా చంద్రబాబు కాదని ఆయనో నయీం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి పేరుకుపోయిందని ఆరోపించిన శ్రీకాంత్ రెడ్డి.. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారని, అది నదుల అనుసంధానం కాదని, అవినీతి అనుసంధానమని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారనడానికి.. టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.
ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహారంపై సీఎం స్పందించాలి : కాకాణి గోవర్దన్ రెడ్డి
రైల్వే కాంట్రాక్టరును బెదిరించి అవినీతి ఉచ్చులో ఇరుకున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహారంపై తక్షణం సీఎం చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి. తనపై ఆరోపణలకు ఎమ్మెల్యే రామకృష్ణ నుంచి కనీసం స్పందన లేదని, దీన్ని బట్టే ఆయన అవినీతికి పాల్పడ్డారనే విషయం స్పష్టమవుతోందని అన్నారు గోవర్దన్ రెడ్డి.
టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పనుల్లో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వాటాలు ముడుతున్నాయని, అందుకే చంద్రబాబు కూడా దీనిపై స్పందించే పరిస్థితి లేదని మండిపడ్డారు. రామకృష్ణ అవినీతి వ్యవహారంతో ప్రస్తుతం టీడీపీ నేతల పరిస్థితి బెల్లం కొట్టిన రాయిలా తయారైందని ఎద్దేవా చేశారాయన.