నేనేమైనా పశువునా: జగన్కు సొంత ఎమ్మెల్యే షాక్, లోకేష్ కోసం..
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినట్లుగా డబ్బుకు అమ్ముడుపోయేందుకు తాను ఏం సంతలో పశువును కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చెప్పారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా గూడూరు వైసిపి ఎమ్మెల్యే పాశం సునీల్ కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తాను ఎల్లుండి (శుక్రవారం) నాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం, రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను సైకిల్ ఎక్కుతున్నానని తెలిపారు. డబ్బుకు అమ్ముడుపోయేందుకు తాను సంతలో పశువును కాదన్నారు.
టిడిపిలో చేరితే తన నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తానని మంత్రి నారాయణ చెప్పారన్నారు. టిడిపిలో చేరితే మంత్రి తన శాఖ నుంచి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి తనకు ముఖ్యమని చెప్పారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అధికార తెలుగుదేశం పార్టీ డబ్బులు పెట్టి కొంటోందని వైసిపి అధినేత జగన్, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ పైవిధంగా స్పందించారు.
మంగళవారం రాత్రి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మంత్రి నారాయణతో కలసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కలుసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఉండటంతో ఆయనకంటే ముందే మంత్రి నారాయణతో కలసి రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.
పది నిమిషాల తేడాతో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన రావు కూడా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. మంత్రి నారాయణ, సునీల్ కుమార్, గరికపాటి మోహన్ రావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. బుధవారం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యాక 8న తేదీన అనుచరులతో కలిసి టిడిపిలో చేరుతానని చెప్పారని తెలుస్తోంది. అనంతరం ముగ్గురు నేతలు ఒకే వాహనంలో వెళ్లిపోయారు.
లోకేష్కు మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు మంత్రి పదవి ఇవ్వాలని కృష్ణా జిల్లా బీసీ సెల్ తీర్మానం చేసింది. మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో ఈ తీర్మానం చేశారు. అదే సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర మద్యపాన నిషేధంపై మాట్లాడారు. బీహార్ తరహా నిషేధం ఇక్కడ సాధ్యం కాదని చెప్పారు. మన పక్క రాష్ట్రాల్లో ఎక్కడా నిషేధం లేదన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు చంద్రబాబు అండగా నిలిచారని, అలాగే ఇప్పుడు చంద్రబాబుకు లోకేష్ అండగా నిలవాలన్నారు. కేబినెట్లో యువతకు ప్రాధాన్యం ఉంటే బాగుంటుందని చెప్పారు.