కర్ణాటక ముఖ్యమంత్రితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన బెంగళూరులోని విధానసౌధలో యడియూరప్ప, కర్ణాటక మధ్య, చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి జేసీ మధుస్వామితో సమావేశం అయ్యారు. కరవు జిల్లా అనంతపురానికి రావాల్సిన పెన్నా జలాలను వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా తురకలాపట్నం మీదుగా పేరూర్ డ్యామ్ నకు పెన్నానదిని విడుదల చేయాలని కోరారు. బెంగళూరు సహా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పెన్నానది నిండుగా ప్రవహిస్తోందని, ఈ జలాల నుంచి ఏపీ వాటాగా రావాల్సిన నీటిని విడుదల చేయాలని తోపుదుర్తి కోరారు.
పెన్నానదిపై కర్ణాటక-ఆంధ్రా సరిహద్దుల్లో గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నిండాలంటే కర్ణాటక పెన్నానీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. గొల్లపల్లి రిజర్వాయర్ కు అనుసంధానిస్తూ మడకశిర బ్రాంచ్ కెనాల్ ను నిర్మించారు. ఈ కెనాల్ ద్వారా పెన్నా జలాలు పేరూర్ డ్యామ్ కు చేరుకుంటాయి. సరైన వర్షాలు లేకపోవడం వల్ల చాలాకాలం నుంచీ ఈ రెండు రిజర్వాయర్లు ఆశించిన స్థాయిలో నిండలేదు.
తాజాగా కురిసిన వర్షాల వల్ల పెన్నానది నిండుగా ప్రవహిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ వాటాగా రావాల్సిన నీటిని విడుదల చేయాలని తోపుదుర్తి కర్ణాటక ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నీటి విడుదలకు గల అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులు ఆదేశించినట్లు సమాచారం.