ఆ ఇద్దరి మధ్య బుసకొడుతున్న ఆధిపత్య పోరు..? ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై అర్ధరాత్రి దాడి..
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మరిది గోపినాథ్పై గురువారం అర్ధరాత్రి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసం కాగా.. గోపీనాథ్కు కూడా గాయాలయ్యాయి. కోటప్పకొండ తిరునాళ్ల నేపథ్యంలో ఏర్పాటు చేసిన విడుదల వారి విద్యుత్ ప్రభ ఊరేగింపును ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఘటనపై ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆధిపత్య పోరే కారణమా..
నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు,ఎమ్మెల్యే విడుదల రజనీకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగానే దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. కోటప్పకొండ తిరునాళ్లను పురస్కరించుకుని చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే స్వగ్రామం పురుషోత్తమపట్నంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన భైరా వారి విద్యుత్ ప్రభ ఊరేగింపుకు శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆయన కారును అడ్డుకున్న విడదల రజనీ మరిది గోపీనాథ్ సహా వారి వర్గీయులు అరగంట సేపు కారును అక్కడినుంచి కదలనివ్వలేదు.
ఎంపీ కాన్వాయ్పై విడదల వర్గీయుల దాడి
తమ విద్యుత్ ప్రభల వద్దకు ఆహ్వానం పలికితే రాని ఎంపీ.. తమ స్వగ్రామంలోనే మరొకరి విద్యుత్ ప్రభ ఊరేగింపుకు రావడం విడదల వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన కాన్వాయ్ను అడ్డగించి దాడికి యత్నించారు. విడదల రజనీ మరిది గోపీనాథ్ కారుపై పిడిగుద్దులు గుద్దుతూ.. వేలు చూపిస్తూ వారిని హెచ్చరించారు. తాజాగా గోపీనాథ్పై దాడి జరగడంతో.. ఎంపీ వర్గీయులే ఆయనపై దాడి చేసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మర్రికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారా..
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విడదల రజనీ వైసీపీలో చేరారు. చిలకలూరిపేట వైసీపీ సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టికెట్ను త్యాగం చేయడంతో విడదలకు టికెట్ దక్కింది. దీంతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలుపొందారు. అయితే ఎన్నికల్లో గెలిచాక మర్రి వర్గీయులకు పూర్తిగా చెక్ పెట్టేందుకు విడదల ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు మర్రి రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం కూడా ఆమెకు నచ్చడం లేదన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్యే అయిన తనను కాదని, మర్రికి ఆయన ప్రాధాన్యం ఇవ్వడం రజనీని అసంతృప్తికి గురిచేస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Recommended Video
జగన్ దృష్టికి విడదల దూకుడు..
ఏదేమైనా పార్టీలో చేరి ఏడాది గడవకముందే విడదల రజనీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలే ఆమె దూకుడుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రజనీ ఇదే శైలిని కొనసాగిస్తే జిల్లాలో ఆమెకు వ్యతిరేక వర్గం సంఖ్య పెరగడం ఖాయమని.. సీఎం జగన్ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని చెబుతున్నారు. విడదలపై ఇప్పటికే సీఎంకు ఫిర్యాదు అందిందన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో విడదలకు జగన్ ఎలాంటి సూచనలు చేయబోతున్నారు.. ఆధిపత్య రాజకీయాలకు ఎలా చెక్ పెట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.