బోండా ఉమకు వైసిపి ఎమ్మెల్యే వార్నింగ్, బాబుపై ఐవీఆర్ యూ టర్న్
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావుకు బ్రాహ్మణులు తగిన విధంగా బుద్ధి చెబుతారని వైసిపి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావుకు బ్రాహ్మణులు తగిన విధంగా బుద్ధి చెబుతారని బాపట్ల వైసిపి ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు.
గుంటూరులో ఆదివారం జరిగిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. ఐవైఆర్ కృష్ణారావుపై విమర్శలు చేయడం తగదని, టిడిపి నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. డిసెంబర్ నెలలో లక్షలాది మంది బ్రాహ్మణులతో సభ నిర్వహిస్తామన్నారు.
బోండా ఉమ ఓ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఫేస్బుక్లో మంత్రి నారా లోకేష్పై పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేశారని, మరి, ఐవైఆర్ పైన పోస్టులు పెట్టిన వారిని ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు.
అంతకుముందు, ఐవైఆర్ కృష్ణారావు కూడా చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేతలపై విమర్శలు గుప్పించిన ఐవీఆర్.. చంద్రబాబుపై మాత్రం అనుకూల వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు సర్కారులో కొందరు అహంభావంగా వ్యవహరిస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు అహంభావి కాదని అన్నారు. అడ్వోకేట్ వేణుగోపాల్ను అకారణంగా తొలగించారని మండిపడ్డారు.
బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ సీఈవోతో తనకు ఎలాంటి ప్రత్యేక సంబంధాలు లేవన్నారు. వేమూరి ఆనంద్ సూర్యకు ఎలాంటి సంబంధం ఉందో తనకు అలాంటిదే ఉందన్నారు. అంతకుముందు ఎంపీ రాయపాటి సాంబశివ రావుపై ఐవీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.