బాబుపై నిప్పులు చెరిగిన వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
దరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల పట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నెల్లూరు జిల్లా కావలిలో పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు వారు సంఘీభావం తెలిపారు.
ఏపీలో బోర్లు వేయాలన్నా సింగపూర్, జపాన్ల నుంచి నిపుణులను తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు అంటారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడి హయాంలో రైతులకు మేలు జరగదని అన్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులోనే చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదన్నారు.
మరో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో నీటి పారుదల రంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోకుండా చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.