ఏపీ కేబినెట్లో కొత్త మంత్రులు వీరేనా.. దాదాపుగా ఫైనల్ చేసిన జగన్- త్వరలో విస్తరణ..
ఏపీలో ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వారి స్ధానాల్లో కొత్త వారి ఎంపిక కోసం జోరుగా కసరత్తు సాగుతోంది. ఇద్దరు బీసీ మంత్రులు కావడం, జగన్ కు వీర విధేయులు కావడంతో వారి స్ధానంలో వచ్చే వారు కూడా అదే సామాజిక వర్గం వారే ఉండాలని కొందరు భావిస్తుండగా... బీసీలకు ఒకేసారి రెండు రాజ్యసభ సీట్లు ఇచ్చినందున మిగతా సామాజిక వర్గాలకు కూడా చోటివ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అదే సమయంలో తొలి కేబినెట్ లో చోటు దక్కని ఆశావహులు కూడా తమను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం జగన్ కు విజ్ఞాపనలు పంపుతున్నారు.
Recommended Video
90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కరోనా పరీక్షలు ... సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలివే !!
కేబినెట్ విస్తరణ కత్తిమీద సామే...
సామాజిక సమీకరణాలే కీలకమయ్యే ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ విస్తరణ ఏ ముఖ్యమంత్రికైనా కత్తిమీద సామే అవుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఏపీలో జరిగిన ప్రతీ కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రులతో పాటు కేబినెట్ ఆశావహులకు సైతం చివరి నిమిషం వరకూ ఉత్కంఠ రేపుతూనే ఉంది. ఈసారి కూడా మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపిక కావడంతో వారి స్ధానాల్లో కేబినెట్ బెర్తులు దక్కించుకునేది ఎవరన్న ఉత్కంఠ పెరుగుతోంది. త్వరలో వీరిద్దరు రాజీనామాలు ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా... వీరి స్ధానాల్లో ఎవరిని భర్తీ చేయాలనే విషయంలో సీఎం జగన్ భారీ కసరత్తే చేస్తున్నారు.
కేబినెట్ రేసులో ఉన్నది వీరే...
ప్రస్తుతం కేబినెట్ మంత్రులుగా ఉంటూ రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇందులో పిల్లి సుభాష్ శెట్టిబలిజ కాగా, మోపిదేవి మత్సకార వర్గానికి చెందిన వారు. దీంతో వీరి స్ధానాల్లో మరో ఇద్దరు బీసీలకే చోటు కల్పించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. కాబట్టి బీసీల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మత్సకార సామాజికవర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు అవకాశం దక్కేలా కనిపిస్తోంది. వీరితో పాటు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు నుంచి గెలిచిన మాజీ మంత్రి పార్ధసారధి పేరు కూడా వినిపిస్తోంది.
జగన్ నిర్ణయం అదేనా ?
త్వరలో చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో బీసీల స్ధానంలో మరోసారి బీసీలకే అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బీసీల కోటాలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, పొన్నాడ సతీష్, పార్ధసారధి ముగ్గురూ రేసులో ఉంటారు. వీరిలోనూ పార్ధసారధి కంటే జోగి రమేష్, పొన్నాడ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే కేబినెట్ లో ఉన్న యాదవ సామాజిక వర్గం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అనిల్, పార్ధసారధి ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో పార్ధసారధికి అనిల్ స్ధానంలో రెండున్నరేళ్ల తర్వాత అవకాశం ఇవ్వాలని జగన్ అప్పట్లో నిర్ణయించారు. కానీ ఆ లోపే మరో విస్తరణ చేపట్టాల్సి రావడంతో అనూహ్యంగా పార్ధసారధి కూడా రేసులోకి వచ్చారు. అయితే జగన్ పార్ధసారధికి ఇవ్వాలంటే కేబినెట్లో ఇద్దరు యాదవులు ఉంటారు. కాబట్టి అవకాశాలు తక్కువే అంటున్నారు.
బీసీలకు ప్రాధాన్యం- ఇతరుల కినుక...
దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్న బీసీ సామాజికవర్గాలు తొలిసారిగా ఏకతాటిపైకి వచ్చి వైసీపీకి ఓటేశాయి. దీంతో బీసీ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునే క్రమంలో జగన్ మరోసారి బీసీలకే కేబినెట్ బెర్తులు కేటాయిస్తారని చెబుతున్నారు. అలా కాదని ఇతరులకు ఇస్తే బీసీల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చేందుకు విపక్ష టీడీపీ ఎదురుచూస్తోంది. అందుకే టీడీపీకి అవకాశం ఇవ్వకుండా జగన్ బీసీల వైపే మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. అయితే ఇతర సామాజికవర్గాల వాదన మరోలా ఉంది. ఇప్పటికే ఇద్దరు బీసీ మంత్రులను రాజ్యసభకు పంపడం ద్వారా మరింత గౌరవం ఇచ్చారని, వారి స్ధానాల్లో ఇప్పటివరకూ కేబినెట్ లో అవకాశం దక్కని వర్గాలకు చోటిస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయని తెలుస్తోంది.