అడ్డంగా దొరికారు, బుద్ధిరాదు: చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యేలు
తిరుపతి: తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, నారాయణ స్వామి విరుచుకుపడ్డారు. మంగళవారంనాడు వారు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు వెదజల్లుతూ ప్రతిపక్ష పార్టీ సభ్యులను కొనుగోలు చేస్తున్నారని వారు చంద్రబాబుపై ఆరోపణ చేశారు. కేవలం డబ్బుల ద్వారానే ఎమ్మెల్సీ పదవులను గెలవాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వారన్నారు. చంద్రబాబుకి బుద్ధిరాదని, చంద్రబాబు విధానం అంతేనని వారన్నారు.
ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టిడిపి నాయకులు తమ పార్టీ ఎంపిటీసి సభ్యులను ప్రలోభపెట్టి నెల్లూరులోని ఓ హోటల్లో దాచిపెట్టారని వారు ఆరోపించారు. డబ్బులకు ఒప్పందం కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు.
అధికార టిడిపి నీచ రాజకీయాల వల్లనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ప్రకాశం జిల్లాలో ఓటుకు నోటు వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని వారు మంగళవారం మీడియా సమావేశంలో ఎన్నికల కమిషన్ను కోరారు.
ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో టిడిపికి మెజారిటీ లేదని, దీంతో తమ పార్టీ సభ్యులను కొనుగోలు చేసేందుకు టిడిపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని వారు విమర్శించారు.