చంద్రబాబూ! మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? వైసీపీ ఎమ్మెల్యేల ధ్వజం: డీజీపీకి ఫిర్యాదు
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇప్పుడు పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయానికి చేరింది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగారు. ఆయనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.
చర్యలు తీసుకోవాలని కోరుతూ
వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, సుధాకర్ బాబు సోమవారం ఉదయం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఆయనకు ఇచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను కించపరచలేదా?
చంద్రబాబుపై సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు అసభ్యకరమైన కామెంట్స్ చేశారంటూ డ్రామాలు ఆడుతున్న చంద్రబాబుకు.. టీడీపీ నాయకులు చేసిన దూషణలు కనిపించలేదా అంటూ నిలదీశారు. సమాజం తలదించుకునేలా ముఖ్యమంత్రిపై పోస్టింగులు పెట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాల్సిన చంద్రబాబు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని, వికృత చేష్టలకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ వల్లే ఎన్టీ రామారావు, కోడెల శివప్రసాద్ వంటి నాయకులు మరణించారని ఆరోపించారు.
చంద్రబాబు దిగజారుడు రాజకీయం..
ఓ విలేకరుల సమావేశంలో.. మీడియా ముందు చంద్రబాబు ఆడవారిని కించపరిచే పదాలను ఉపయోగించారని మండిపడ్డారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇంతలా దిగజారుతారని ఎవరూ అనుకోరని చెప్పారు. మహిళలను కించ పరిచేలా పోస్ట్ అయిన కామెంట్లను ఉచ్ఛరించి, అందరికీ తెలిసేలా చేశారని, చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టించిన ఉదంతాన్ని, గణేషుడి మండపంలో టీడీపీ కార్యకర్తలు చేసిన అవమానాన్ని కూడా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో చూపించి ఉంటే బాగుండేదని శ్రీదేవి అన్నారు.