'పవన్ కళ్యాణ్! బాబు-మోడీ కలిసి ముందుకు తీసుకెళ్తారన్నావుగా'
విజయవాడ: నారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలు కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తారని చాలామంది చెప్పారని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారని, కానీ వారు రాష్ట్రానికి ఏం చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఆ పార్టీ నేత పార్థసారథి మంగళవారం ధ్వజమెత్తారు.
చంద్రబాబు కన్నీళ్లు వద్దు
రాష్ట్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నిస్సహాయత, చేతకానితనానికి అద్దం పట్టిందన్నారు. రాష్ట్రానికి కావాల్సింది చంద్రబాబు కన్నీళ్లు కాదని, రాష్ట్ర అభివృద్ధి అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి ప్రజల నోట్లో మట్టి కొట్టారన్నారు. 5 కోట్ల మంది ఏపీ ప్రజలను బికారీగా చేశారన్నారు.
బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగినా చంద్రబాబు నోరు విప్పి అడగరని, ఎన్డీయేలో మాత్రం కొనసాగడం విడ్డూరమన్నారు. అవినీతి సొమ్ముతో టిడిపి నేతలు జేబులు నింపుకుంటున్నారని చెప్పారు. ప్రజల చెవుల్లో చంద్రబాబు పూలు పెడుతున్నారన్నారు.
బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగితే, చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మట్టి, నీళ్లు తెచ్చారన్నారు. బడ్జెట్లో రాజధాని అమరావతికి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు.
చేరికలపై నిప్పులు చెరిగిన శ్రీకాంత్ రెడ్డి
అనునిత్యం విశ్వసనీయత గురించి మాట్లాడే చంద్రబాబు ఓ విషయం గుర్తుంచుకోవాలని.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎలా సరైనదో చెప్పాలన్నారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని టిడిపి కండువాలు కప్పడం తప్పు కాదా అని చంద్రబాబు చెప్పాలన్నారు.
వైసిపికి చెందిన ఎమ్మెల్యేలకు టిడిపి కండువాలు కప్పడం తప్పని చంద్రబాబు తెలుసుకోరా అని ప్రశ్నించారు. మీడియా అంటే తమకు గౌరవం ఉందని, కానీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రూ.20 నుంచి రూ.30 కోట్లకు కొనుగోలు చేస్తున్నారని, ఇది మీడియాలో ఎందుకు రావడం లేదన్నారు.
దోచిన డబ్బుతోనే..
ప్రాజెక్టుల ద్వారా దోచిన డబ్బును ఎమ్మెల్యేలను కొనేందుకు ఉపయోగిస్తున్నారన్నారు. మీడియాలో ప్రతినిత్యం.. ఈ ఎమ్మెల్యేలు వెళ్తున్నారని పదేపదే జోరుగా ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. బాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
ముషారఫ్ పాలనలా
ఏపీలో ముషారఫ్ పాలన, తాలిబన్ల పాలనలా కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్ట వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం ఏం పద్ధతి అన్నారు. క్యారెక్టర్ గురించి మాట్లాడే చంద్రబాబు ఫిరాయింపుదారులను ఏ క్యారెక్టర్ అంటారో చెప్పాలన్నారు.
నాకే సలహాలిస్తారా.. అని జగన్ ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయని, అది సరికాదన్నారు. జగన్తో తమ ఎమ్మెల్యేల భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. నిన్నటి వైసిపి సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనంత మాత్రాన ఇష్టంరీతిన ప్రచారం చేయడం సరికాదన్నారు.
ఇక మీడియాపై దావా
కాబట్టి ఇకముందు తమ పైన దుష్ప్రచారం చేసే మీడియాపై డిఫేమేషన్ వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తమకు మీడియా పైన గౌరవం ఉందని, కాని అవాస్తవాలను ప్రచారం చేయవద్దన్నారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. విశ్వాసంతో ముందుకెళ్తామన్నారు.
తప్పుడు ప్రచారాల పైన న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. తాను ఏ మీడియా పేరును చెప్పడం లేదన్నారు. కానీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. చంద్రబాబు, మోడీ కలిసి ముందుకు తీసుకు వెళ్తారని చెప్పారని, కానీ వారు ఎంత వరకు తీసుకు వెళ్లారో నాడు చెప్పిన వారు చెప్పాలని పవన్ కళ్యాణ్, ఇతరులను ఉద్దేశించి అన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి చేరికలను ప్రోత్సహిస్తే ఎలాగన్నారు. చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పాలన లేదన్నారు. ప్రభుత్వం పైన తాము అవిశ్వాసం పెడుతున్నామని చెప్పారు. చంద్రబాబు అనుకూల మీడియా దుష్పర్చారం చేయడం సరికాదన్నారు.