నల్ల దుస్తుల్లో వైసీపీ సభ్యులు: చప్పట్లు కొడుతూ స్పీకర్ పోడియం ముట్టడి
హైదరాబాద్: శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలని కోరుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. రోజాను హైకోర్టు ఉత్తర్వులున్నా సభలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
స్పీకర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు వెల్లోకి దూసుకు వచ్చి నినాదాలు చేశారు. 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ సభను హోరెత్తించారు.
ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. జీరో అవర్ తర్వాత ఆ అంశంపై మాట్లాడుకోవచ్చని, అంతవరకు సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ కోరారు. అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఒకవైపు బడ్జెట్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతుండగా మరోవైపు వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోస్పీకర్ కోడెల శివప్రసాద్, విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతక ముందు బడ్జెట్ పై సభ్యులు గోరంట్ల, అనిత, పార్థసారధిలు మాట్లాడారు.
రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినా, ఆమెను సభలోపలికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ నల్ల రంగు దుస్తుల్లో సభకు రావాలని శుక్రవారం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.