రాజధాని రైతుల కాళ్లు విరగ్గొట్టండి..!!
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తున్న రైతులు ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో తమ యాత్రను కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు 60 రోజుల పాదయాత్రను గత నెల 12వ తేదీన ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలమీదగా గోదావరి జిల్లాలు, ఆ తర్వాత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొనసాగనుంది. కాకినాడవైపు యాత్ర చేస్తున్న రైతులను అడ్డుకోవాలంటూ మంత్రి హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ పిలుపు తీవ్ర వివాదాస్పదమైంది.
ఏదైనా జరిగితే బాబుదే బాధ్యత!
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న బొత్స వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా తన ప్రకటనను బొత్స సమర్థించుకున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్ర జరక్కుండా అడ్డుకుంటామని ప్రకటించారు. యాత్రపై ఘాటుగా స్పందించిన దువ్వాడ పాదయాత్ర చేస్తున్నవారికి ఏదైనా దుష్పరిణామం జరిగితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు.
వారంతా రైతులు కాదు.. పెయిడ్ ఆర్టిస్టులు?
పాదయాత్ర చేస్తున్నవారంతా రైతులు కాదని, వారంతా పెయిడ్ ఆర్టిస్టులని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా యాత్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబునాయుడు చేస్తున్న స్తిరాస్థి వ్యాపారంలో ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పెట్టబడి పెట్టారని, ఆయన పెట్టుబడిదారుడని విమర్శలు గుప్పించారు. పాదయాత్రను తక్షణమే వెనక్కి మళ్లించాలని, లేదంటే జరిగే ప్రతి సంఘటనకు బాబే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఉత్తరాంధ్రలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతాం!!
తమ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానన్నారని, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వ్యతిరేకిస్తున్న అచ్చెన్నాయుడికి రాజకీయంగా పతనం ప్రారంభమైందన్నారు. రానున్న ఎన్నికల్లో అచ్చెన్నను ఘోరంగా ఓడిస్తామన్నారు. రాజధాని రైతులు ఉత్తరాంధ్రలోకి అడుగు పెడితే కాళ్లు విరగ్గొట్టేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీనివాస్ అన్నారు.