14న వైసిపి అవిశ్వాసంపై చర్చ: కామినేని 'పంది' వ్యాఖ్యపై నోటీసు!
హైదరాబాద్: గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వైసిపి సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకుముందు వైసిపి ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చింది. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు అవిశ్వాసం నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరోవైపు, సభలో జగన్ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలలో ఒక్కటీ నెరవేరడం లేదన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పారని, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేకుండా పోయిందని జగన్ సభలో మండిపడ్డారు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. హామీలు నెరవేర్చనందుకు తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని జగన్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది.
అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... జగన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ తెలుసుకుంటున్నాడో లేదో అర్థం కావడం లేదన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో చేసినప్పటికీ... అవి తెలుసుకోలేకపోయారన్నారు. ఏం జరుగుతున్నావో తెలుసుకోలేని ప్రతిపక్ష నేత ఉండటం మన దౌర్భాగ్యం అన్నారు.
కాగా, వైసిపి అవిశ్వాస నోటీసు పైన స్పీకర్ స్పందించారు. ఈ నెల 14వ తేదీన అవిశ్వాసం పైన చర్చ ఉంటుందని సభాపతి చెప్పారు.
జగన్కు కాల్వ సూటి ప్రశ్న
కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైసిపిపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అసంతృప్తి ఉంటే నిరసన తెలిపేందుకు చాలా మార్గాలు ఉన్నా వాటిని ఆశ్రయించకుండా వీగిపోయే అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం ఎందుకన్నారు.
సభ నుంచి వైసిపి వాకౌట్ చేసిన అనంతరం.. సభ నుంచి నుంచి బయటకు వచ్చిన కాల్వ మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైసిపి వైఖరిని తప్పుబట్టారు. మీరు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మీ పార్టీలోని ఎంతమంది ఎమ్మెల్యేలకు విశ్వాసముందని, అనుకూలంగా ఎంతమంది ఓటేస్తారని ప్రశ్నించారు.
కామినేనిపై సభా హక్కుల నోటీసు
బిజెపి సభ్యుడు, మంత్రి కామినేని శ్రీనివాస రావు పైన వైసిపి సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైంది. తమ పార్టీ అధినేత జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో నోటీసు ఇవ్వనుంది.
నిన్న కామినేని సభలో మాట్లాడుతూ... పచ్చకామెర్ల వాళ్లకు దేశమంతా పచ్చగా కనిపిస్తుందని, పంది బురదలో ఉండి అందరి మీదా బురద చల్లాలని అనుకుంటుందని, అది కరెక్ట్ కాదని జగన్ను ఉద్దేశించి అవినీతి విషయంలో వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు
వైసిపి ఎమ్మెల్యేలు గురువారం ఉదయం ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులు అందజేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసును ఇచ్చారు. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... ఎన్నికల హామీ వైఫల్యానికి నిరసనగా అవిశ్వాసం నోటీసు ఇచ్చినట్లు చెప్పారు.
అంతకుముందు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు తెలుగుదేశం ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వనుంది. ఈ విషయాన్ని వైసిపి ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డిలు గురువారం ఉదయం విలేకరులతో చెప్పారు.
కాసేపట్లో తాము సభాపతికి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తామని వారు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసిపి చాలా రోజులుగా భావిస్తోంది.
మరోవైపు, ఈ రోజునే అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉపాధికల్పనకు ప్రాధాన్యమిస్తామని, అమరావతిలో మౌలిక వసతులకు నిధులు కేటాయిస్తామన్నారు.
బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకుగాను కేంద్రం సాయం కోరుతున్నామన్నారు. ప్రజలపై పన్నుల భారం ఉండదని, త్వరలో యూత్ పాలసీ ప్రకటిస్తామని యనమల రామకృష్ణుడు చెప్పారు.