ముఖ్యమంత్రి సహాయ నిధికి వైసీపీ ఎంపీల భారీ విరాళం.. రూ.5.25 కోట్లు: మూడు నెలల వేతనానికి అదనంగా.. !
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నివారణ చర్యల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు భారీ విరాళాన్ని ప్రకటించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి 4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనూరాధ 25 లక్షల రూపాయలను కేటాయించారు.
వారంతా తమ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని అయిదు కోట్ల రూపాయలు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు 70 లక్షల రూపాయలను మంజూ నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన నలుగురితో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీల సంఖ్య ప్రస్తుతం 28కి చేరిందని, వారందరి నుంచీ నాలుగు కోట్ల రూపాయల ఎంపీల్యాడ్స్ నిధులను కేటాయించగలిగితే.. 112 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి సహాయనిధికి సమకూరుతాయని బాలశౌరి ముఖ్యమంత్రికి సూచించారు.
కరోనా వైరస్ను నివారించడానికి ప్రభుత్వం చేపడుతోన్న చర్యల కోసం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ తమ మూడు నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు నెలల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి మరో నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి చెల్లిస్తామని వెల్లడించారు. దీనితోపాటు బాలశౌరీ, రఘురామ కృష్ణంరాజు, చింతా అనూరాధ అదనంగా తమ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి నిధులను ముఖ్యమంత్రి సహాయనిధికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి తన నియోజకవర్గం పరిధిలో అధికార యంత్రాంగం విస్తృతంగా కృషి చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రశంసించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు, డాక్టర్లు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, కరోనా వైరస్ నియంత్రణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వైరస్ మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.