మిస్టరీ: సామాన్యులు మోసపోతే ఓకే... మరి ఈ వైసీపీ ఎంపీ ఎలా మోసపోయారబ్బా..?
ప్రజలను బురిడీ కొట్టించే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. సాధారణ ప్రజలంటే మోసపోతున్నారు సరే... కానీ ప్రజాప్రతినిధులు కూడా ఈ కేటుగాళ్ల మాయలో పడి మోసపోతున్నారంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది. కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తే ఎంపీగా గెలిచిన వ్యక్తి ఇలా ఒక కేటుగాడి చేతిలోనే దెబ్బై పోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. పోనీ ఆ ఎంపీ పెద్దగా చదువుకోలేదా అంటే అదీ కాదు.. పెద్ద చదువులే చదివారు. అయినా సరే ఇలాంటి టోక్రాగాడి చేతుల్లో మోసపోతున్నారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్: మంత్రి వెల్లంపల్లి సహా ఇద్దరిపై హైకోర్టులో పిటీషన్: కాస్సేపట్లో
ఎంపీని బురిడీ కొట్టించిన మోసగాడు
ఈ రోజుల్లో బురిడీ బాబులు ఎక్కువైపోయారు. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడ చిన్న అవకాశం దొరికినా ఈ కేటుగాళ్లు దాన్ని వంద శాతం వినియోగించుకుంటున్నారు. సామాన్యులైతే మోసపోతున్నారు కానీ.. ప్రజాప్రతినిధులను సైతం ఈ కేటుగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ కేటుగాడి పన్నాగానికి అమలాపురం ఎంపీ చింతా అనురాధా బలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీ నాయుడు కేవలం ప్రజాప్రతినిధులనే టార్గెట్గా బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేయడం హాబీగా మలుచుకున్నాడు. కానీ అతని పప్పులు ఎక్కువ కాలం ఉడకలేదు. టైమ్ బ్యాడ్ అయి పోలీసులకు చిక్కాడు. ఇక అసలు విషయానికొస్తే అమలాపురం ఎంపీ చింతా అనురాధాను మోసం చేసి రూ.2.50 లక్షలు వసూలు చేశాడు.
పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశాడు
చాలా కాలం క్రితం కొన్ని కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ నాయుడు తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే టైమ్ బ్యాడ్ కావడంతో ఏలూరు చెక్పోస్టు వద్ద పోలీసులు అతన్ని పట్టుకుని భీమవరంలోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. అక్కడే ఇతగాడు మరో స్కెచ్ వేశాడు. తనతో పాటుగా ఉన్న మరో వ్యక్తి ఫోన్ నుంచి అమలాపురం ఎంపీ చింతా అనురాధాకు ఫోన్ చేసి తనను తాను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. తాను పీఎంఈజీపీ (ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం) డిప్యూటీ డైరెక్టర్ అని చెప్పుకున్నాడు. ఈ ప్రోగ్రాం కింద దరఖాస్తు చేసుకుంటే నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ.3 కోట్లు నిధులు వస్తాయని చెప్పుకొచ్చాడు. ఈ మొత్తాన్ని తమ నియోజకవర్గంలోని యువత సంక్షేమానికి ఈ నిధులు వినియోగించుకోవచ్చని ఎరవేశాడు. అయితే ఇందుకు కొంత ఖర్చు అవుతుందని చెప్పాడు. ఇంతవరకు స్టోరీనీ బాగానే అల్లాడు. స్క్రీన్ ప్లేను పక్కాగా అమలు చేశాడు. ఇంకేముంది ఎంపీ చింతా అనురాధా ఈ కేటుగాడి మాటలను నమ్మి రూ. 2.50 లక్షలు అతని ఖాతాకు జమచేసింది.
Recommended Video
జిల్లాలో జోరుగా చర్చ
తన పీఏ ద్వారా డబ్బులు బదిలీ చేయించిన ఎంపీ అనురాధా ఆ తర్వాత బాలాజీ నాయుడు కోసం ఫోన్ చేసింది. అయితే ఫోన్ ఎంతకీ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసును పోలీసులు రహస్యంగా విచారణ చేశారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. కేసుకు సంబంధించి వివరాలను పోలీసులు ఏదశలోనూ బయటపెట్టలేదు. అంతేకాదు చింతా అనురాధా తర్వాత మరో 30 మందిని కూడా బాలాజీ నాయుడు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇక మామూలు ప్రజలు మోసపోతే అర్థం ఉంటుంది కానీ ఏకంగా ఒక ఎంపీ మోసపోవడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక బాలాజీ నాయుడును పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా అతనికి న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.