సీఎం జగన్ సరేనంటే చుక్కలు చూపిస్తా.. ముఖం పగలగొట్టి పంపుతారు.. ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్లు
'ఒక రాష్ట్రం- ఒక రాజధాని(వన్ స్టేట్-వన్ క్యాపిటల్)' నినాదంతో 'సేవ్ అమరావతి' ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చంద్రబాబు రాయలసీమ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన సోమవారం అనంతపురం జిల్లాలో సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. బాబు పర్యటన నేపథ్యంలో అనంతపురం ఒక్కసారిగా వేడెక్కింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్లతో మరింత కాకపుట్టిస్తున్నారు.
సార్ సిగ్నలిస్తే దూకుతా..
జీవితకాలంలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పర్యటనకు వస్తారని ఎంపీ మాధవ్ ప్రశ్నించారు. బాబు పేరు వింటేనే సీమవాసులు మండిపడుతున్నారని చెప్పారు. ‘‘సీఎం జగన్ సరేనంటే.. వైసీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నలిస్తే నేను స్వయంగా రంగంలోకి దూకి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటా.. చంద్రబాబు ముఖం పగలగొట్టడానికి రాయలసీమ ప్రజలు రెడీగా ఉన్నారు'' అని మాధవ్ చెప్పారు.
ఇద్దరూ ద్రోహులే..
చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. పోలీసులు ఎన్ని ఆటంకాలు కలగజేసినా.. చంద్రబాబు పర్యటనలో పాల్గొంటానని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జేసీ కామెంట్లను, చంద్రబాబు తీరుు ప్రస్తావిస్తూ మాధవ్ నిప్పులు చెరిగారు. ‘‘ఒకరేమో రాయలసీమను వెనుకబాటుకు గురిచేశారు. ఇంకొకరేమో పోలీసులతో బూట్లు నాకిస్తానని పిచ్చికూతలు కూశారు. సీఎం అనుమతిస్తేగనుక వీళ్లిద్దరినీ నేనే అడ్డుకుంటా''అని ఫైరయ్యారు.
ముందస్తుగానే జేసీ అరెస్టు?
అనంతపురంలో చంద్రబాబు ప్రవేశించడానికి ముందే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలకు మగతనం ఉంటే పోలీస్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి రావాలని సవాలు విసిరిన జేసీ.. సీఎం జగన్ వి అడుక్కుతినేవాడి ఆలోచనలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.