బీజేపీ-జగన్ లింకుపై బాబు, అంతలోనే: టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి షాక్, వైసీపీ ఎంపీతో భేటీ!
Recommended Video
అమరావతి: ఓ వైపు బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మంగళవారం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీలో జరిగే కీలక నిర్ణయాలు అన్ని వైసీపీకి ముందే తెలుస్తున్నాయని, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ అని వైసీపీ నేత విజయ సాయి రెడ్డికి ముందే తెలిసి, బీహార్ గవర్నర్గా ఉన్నప్పుడే వెళ్లి కలిశారన్నారు.
బీజేపీ-వైసీపీ సీక్రెట్పై బాబు, అంతలోనే
తాను ఎన్డీయేలో ఉన్నప్పటికీ అమిత్ షా చెప్పే వరకు తెలియదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ హోదా ఇస్తారని విజయసాయి చెబుతున్నారని, అలాంటప్పుడు అవిశ్వాసం ఎందుకు పెడుతుందని ప్రశ్నించారు. ఓ వైపు వైసీపీ-బీజేపీ మధ్య రహస్య ఒప్పందమని టిడిపి చెబుతుండగానే మరో సంఘటన చోటు చేసుకుంది.
పీయూష్ గోయల్ కోసం టీడీపీ ఎంపీల పడిగాపులు
రైల్వే మంత్రి పీయూష్ గోయల్ను కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ లభించలేదని తెలుస్తోంది. కానీ, వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాత్రం గోయల్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటులో గోయల్ అపాయింట్మెంట్ కోసం మంగళవారం ఉదయం నుంచి టీడీపీ ఎంపీలు పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోయింది.
సాయంత్రం అపాయింటుమెంట్ ఇచ్చినా
సాయంత్రం నాలుగు గంటలకు గోయల్ను కలిసేందుకు తమ ఎంపీలకు అవకాశమిచ్చారు కానీ, ఆ తర్వాత, వాయిదా వేస్తున్నట్టు గోయల్ కార్యాలయం అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయామని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయం పేర్కొంది.
అదే సమయంలో కలిసిన వైసీపీ ఎంపీ
అదేసమయంలో వైసీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాత్రం గోయల్ను కలిశారని తెలుస్తోంది. తన నియోజకవర్గంలోని రైల్వే సమస్యలపై మంత్రికి వరప్రసాద్ రెండు వినతి పత్రాలు సమర్పించారు. గోయల్ను వరప్రసాద్ కలిసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కేంద్రం తీరుకు ఈ సంఘటన
కాగా, ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్మెంట్ను రద్దు చేసి అదే సమయంలో వైసీపీ ఎంపీకి అపాయింట్మెంట్ ఇచ్చారనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరుకు ఈ సంఘటనే అద్దం పడుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, రైల్వేజోన్ సాధ్యం కాదంటే ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని, రైల్వే మంత్రి, పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్కు టీడీపీ ఓ లేఖ రాసింది.