బాబును నమ్ముతారా? వైయస్ ఉండి ఉంటే..: జగనే సీఎం అంటూ మేకపాటి
Recommended Video
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు డయా ఫ్రమ్ వాల్ కట్టి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు.. ఇప్పటికీ పూర్తి చేయలేదని మండిపడ్డారు.
బాబు మాయమాటలను నమ్మరు
పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.44,500కోట్లు కావాలని, ఈ నిధులు కేంద్రమే ఇస్తుందా? అని ప్రశ్నించారు. అంతేగాక, ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు చంద్రబాబును నమ్మరని అన్నారు.
వైయస్ ఉండి ఉంటే..
పోలవరానికి ఫౌండేషన్ వేసింది దివంగత సీఎం వైయస్సార్ అని, ఆయన ఉంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని ఎంపీ మేకపాటి అన్నారు. ఆయన హయాంలోనే 39శాతం వరకూ పనులు పూర్తయ్యాయని ఎంపీ చెప్పారు.
కేంద్రం పూర్తి చేస్తామంటే..
‘పోలవరం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.58కోట్లు.. ఇప్పటివరకు పెట్టింది రూ.13,500కోట్లు ఖర్చుపెట్టామంటున్నారు. కేంద్రం పూర్తి చేస్తామంటే.. ఆ బాధ్యతలను సీఎం చంద్రబాబు తీసుకున్నారు. చంద్రబాబు వల్లే పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి' అని ఎంపీ మేకపాటి ఆరోపించారు.
సీఎం జగనే
పోలవరం ప్రాజెక్టు పూర్తికావడంపై చాలా సందేహాలున్నాయని మేకపాటి అన్నారు. 2014లో పోలవరంను మూడేళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు అన్నారని, ఆ నిధులు చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారో చంద్రబాబు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు ఆపాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అన్నారు.