మిథున్ రెడ్డికి షాక్: బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు బుధవారం నాడు బెయిల్ నిరాకరించింది. చిత్తూరు జిల్లా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా అధికారిపై దాడి కేసులో మిథున్ రెడ్డి అరెస్టయ్యారు.
ఈ కేసులో భాగంగా కొద్దిరోజుల క్రితం మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి ఎంపీకి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అతని బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
కాగా, ఎంపీ మిథున్ రెడ్డిని హైడ్రామా మధ్య పోలీసులు నాలుగు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాడు అరెస్ట్ అనంతరం అతనికి శ్రీకాళహస్తి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని జైలుకు తరలించారు.
కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయ మేనేజర్ పైన దాడి కేసులో గత శనివారం రాత్రి అతడు అరెస్టయ్యాడు. గట్టి బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం చెన్నై నుంచి శ్రీకాళహస్తికి మిథున్ రెడ్డిని తీసుకువచ్చి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై జడ్జి ఇంటికి తీసుకువెళ్లి హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించారు. తాజాగా బెయిల్ నిరాకరించారు.