అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కాం-లోక్సభలో మిథున్రెడ్డి- సీబీఐ విచారణకు డిమాండ్
ఏపీలో రాజధాని అమరావతి భూసేకరణ పేరిట జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై దర్యాప్తు వ్యవహారం వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో పార్లమెంటులో వైసీపీ ఎంపీలు దీన్ని ప్రస్తావించారు. రాజధాని కోసమని భూములను సేకరించారని, అందులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభ దృష్టికి తెచ్చారు. ఇందులో మాజీ అడ్వకేట్ జనరల్తో పాటు సుప్రీంకోర్టు జడ్జి కుటుంబ సభ్యులు సైతం పాలుపంచుకున్నారని మిథున్ ఆరోపించారు.
అసైన్డ్ భూములను సైతం పేదల నుంచి లాక్కొన్నారని, తెల్ల రేషన్ కార్డు దారులు భారీగా భూములు కొనుగోలు చేశారని, ఇందులో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి లోక్సభకు తెలిపారు. ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చిందని, మాజీ అడ్వకేట్ జనరల్తో పాటు పలువురు పెద్దలు భాగస్వాములైన ఈ స్కాంపై సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు బయటికి వస్తాయని మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.
అమరావతిలో భూముల సేకరణ ఎలా సాగింది, అందులో అక్రమాలు ఎలా జరిగాయన్న దానిపై లోక్సభకు మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు. దేశంలోనే అతి పెద్ద కుంభకోణమైన అమరావతి భూముల స్కాంపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ ఇప్పటికే సిఫార్సు చేసిందని, కేంద్రం దాన్ని ఆమోదించి దర్యాప్తు చేయించాలని మిధున్ రెడ్డి సూచించారు. రాజధాని భూముల కేసు విచారణపై హైకోర్టు స్టే నేపథ్యంలో లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో హైకోర్టు ఆదేశాలను సైతం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇవాళ ప్రకటించారు.