రాజ్యసభకు నారా లోకేశ్.. గెలిచే సీటైతే చంద్రబాబు చేసేదదే: ఎంపీ నందిగం సురేశ్ సెటైర్
''గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణంగా మాట్లాడారు. ఇప్పుడేమో దళితులను చట్టసభల్లోకి పంపడానికే పోటీకి నిలబడ్డామని చెబుతున్నారు. ఎంతో గొప్ప మనసుతో ఓడిపోయే రాజ్యసభ సీటును దళితుడికి కేటాయించిన చంద్రబాబుది ప్రేమో, పగో అర్థం కావడంలేదు. నిజంగా తనకు 41మంది ఎమ్మెల్యేలుండి, కచ్చితంగా గెచిలే సీటైతే మరో ఆలోచన లేకుండా నారా లోకేశ్నే రాజ్యసభకు పంపేవారు''అని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ఎద్దేవా చేశారు.
Recommended Video
బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సురేశ్.. టీడీపీలోని దళిత నేతలకు పదవులు ఆశ చూపించి ఆడుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. 2008లో గెలిచే అవకాశం ఉన్నా దళితులకు రాజ్యసభ అవకాశం కల్పించలేదని, 2016లో పుష్పరాజును, ఆ తర్వాత గవర్నర్ పదవి పేరుతో మోత్కుపల్లి నర్సింహులును బాబు దారుణంగా మోసం చేశాడని, తద్వారా దళిత నేతల్ని బలిపశువులు చేస్తూ వచ్చారని, తాగా వర్ల రామయ్యను పోటీకి దింపడం కూడా అలాంటిదేనని విమర్శించారు.
''బేసిగ్గా దళితుల్ని గౌరవించని పార్టీ టీడీపీ. పేరుకు సామాజిక న్యాయం అంటారుగానీ చంద్రబాబు తన సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేసుకుంటారు. ఇప్పటికైనా ఆ పార్టీలోని దళిత నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బాబు చేతిలో బలికాకుండా ఎదురుతిరగాలి. టీడీపీలో ఉండి ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి నేతలు వైసీపీ బాటపట్టారు''అని ఎంపీ నందిగం అన్నారు.
ఏపీలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఒక సీటు గెలవాలంటే కనీసం 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అసెంబ్లీలో టీడీపీకి కేవలం 23 స్థానాలే ఉన్నప్పటికీ వర్ల రామయ్యను అభ్యర్థిగా బరిలోకి దింపింది. నాలుగు సీట్లలో రెండు మాత్రమే బీసీలకు ఇచ్చి, మిగతా రెండు టికెట్లను వైసీపీ అంబానీకి, అయోధ్యరామిరెడ్డికి అమ్ముకుందని, తద్వారా దళితులకు అన్యాయం చేసిందని, దాన్ని ఎత్తి చూపడానికే అభ్యర్థిని నిలబెట్టామని టీడీపీ వాదిస్తోంది.