ఆంధ్రప్రదేశ్పై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. బడ్జెట్ కేటాయింపులేవీ: రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
ఆంధ్రప్రదేశ్పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రైల్వే జోన్పై ఎలాంటి ప్రస్తావన లేదని, విశాఖ మెట్రోకు నిధులు కేటాయించలేదని అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నారని... అలాంటి ప్లాంట్ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గురువారం(ఫిబ్రవరి 11) రాజ్యసభలో కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్ను మూడు దశల్లో పునరుద్ధరించాలని ప్రధానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలని... రుణాలను ఈక్విటీగా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇకనైనా విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులను కేటాయించాలన్నారు. స్టీల్ ప్లాంట్పై ఆధారపడి లక్షకుటుంబాలు జీవిస్తున్నాయని గుర్తుచేశారు. దేశ ఆర్థిక సమస్యలకు జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ పరిష్కారం కాదని తెలిపారు.
ఏపీకి కిసాన్ రైళ్లు ఎక్కువగా నడపాలని... మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.సంకుచిత బుద్ధితో టీడీపీ నేతలే ఆలయాలను కూల్చారని, ఆలయాల్లో విధ్వంసంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
కాగా,వైజాగ్ స్టీల్ ప్లాంట్ను 100శాతం ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో తమ బతుకులు రోడ్డునపడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్... కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని,ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ ప్రతీక అని గుర్తుచేస్తున్నారు. గత కొద్దిరోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇప్పటికే ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. అవసరమైతే స్టీల్ ప్లాంట్ను ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. అటు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.