బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్కు చంద్రబాబు సిఫార్సా?
సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి, గడిచిన ఏడాదిన్నరగా తీవ్రస్థాయి విమర్శలు, అనూహ్య ఆరోపణలు చేస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య పరిణామాల మధ్య అరెస్టు కావడం, రిమాండ్ లో ఆయనపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం, వాటిపై మెడికల్ కమిటీలు ఏర్పాటు కావడం తెలిసిందే. ఎంపీ బెయిల్ పైనా ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో చెప్పుకోదగ్గ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రఘురామ తక్కువ కాలంలో ఇంతలా వివాదాస్పదం కావడం, రాజద్రోహం కేసుల్లో అరెస్టు కావడానికి దారితీసిన పరిస్థితులపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక సూత్రీకరణ చేశారు. మరిన్ని వివరాలివి..
రఘురామ వివాదం: జగన్పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందో
సుప్రీంకోర్టులో షాక్..
ఏపీ ప్రభుత్వంపై వివిధ రూపాల్లో విద్రోహానికి పాల్పడిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. తన అరెస్టు, బెయిల్, వైద్య పరీక్షలకు సంబంధించి ఎంపీ.. గుంటూరు స్థానిక కోర్టుతోపాటు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వివిధ పిటిషన్లు వేశారు. బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ బి. ఆర్. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయనను ఆర్మీ ఆస్పత్రికి లేదా ఎయిమ్స్ కు తరలించాలని ఆదేశించింది. కానీ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ, బెయిల్ పిటిషన్ విచారణను ఈనెల 21(శుక్రవారానికి) వాయిదా వేసింది. ఇదిలా ఉంటే,
రఘురామ భార్యపై సాయిరెడ్డి..
అధికార వైసీపీ ఎంపీ రఘురామ అరెస్టుపై ప్రతిపక్ష టీడీపీ హడావుడి చేస్తోందంటూ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రఘురామ ఆరోగ్యం, కడప వాసులతో ఆయన హత్యకు పథకమంటూ రఘురామ భార్య రమాదేవి చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ, మొత్తం వ్యవహారం వెనుక చంద్రబాబు హస్తముందంటూ సాయిరెడ్డి తీవ్ర కామెంట్లు చేశారు. ''అరెస్టైంది అధికార పార్టీ ఎంపీ. మరి విపక్షాలు, పచ్చ మీడియా వాళ్లు గింజుకుంటున్నారేంటి? వారి శోకాలు చూస్తే అసలు గుట్టు బయటపడేలా ఉంది. అచ్చెం, ధూళిపాళ్ల, కొల్లు అరెస్టైనప్పుడు కూడా టీడీపీలో ఈ ఏడుపులు, పెడబొబ్బలు లేవే. అంతగా పెనవేసుకుపోయాడా ఈ ఖైదీ 3468? అద్దె మైకులిచ్చింది మీరేనా? జగన్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఎల్లోమీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు బాగా తెలిసిన విద్య. కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు పన్నుతున్నారు'' అని మండిపడ్డారు.
జారుడుబండ.. పడితే అంతేగతి
రఘురామ వివాదంపై ఎంపీ సాయిరెడ్డి ఫిలాసఫీ థియరీ చెప్పుకొచ్చారు. ''దిగజారుడు అనేది జారుడు బండ లాంటిది. పతనం వైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎందుకిలా జరిగింది అని ఆలోచించుకునేటప్పటికి టైం మించి పోతుంది.. ఎవరో రెచ్చగొడితే, ఈల వేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే అవుతుంది. స్వయంకృతానికి బాధ్యులుండరు'' అని రఘురామపై సాయిరెడ్డి కామెంటారు. సొంత పార్టీ ఎంపీలు నలుగురిని స్వయంగా తనే బీజేపీలోకి పంపిన చంద్రబాబు వారిపై ఒక్క మాట మాట్లాడలేదని, వైసీపీ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయించాడని, ప్రభుత్వంపై కేసులు వేయించాడని, దీన్ని రాజకీయం అనేకంటే బ్రోకరిజం అనడమే బెటరని సాయిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై..
బెయిల్ రద్దయి జగన్ను కొడితే?
నర్సాపురం ఎంపీ అరెస్టు వివాదంలో చంద్రబాబు రియాక్షన్ ను తప్పుపడుతూ వైసీపీ నేతలు చేస్తోన్న కామెంట్లుకు టీడీపీ నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి. ''రఘురామ వ్యాఖ్యల్లో రాజద్రోహం ఉందని సీఎం జగన్ కు అనిపిస్తే, మరి ఆయన కమ్మసామాజికవర్గం గురించి అన్నమాటల సంగతేంటి? జగన్ రెడ్ల పక్షపాతి అని ఏపీలో చిన్నపిల్లలకూ తెలుసు. రాఘురామ ఒంటి మీద దెబ్బలపై వైసీపీ నేతలు విపరీత కామెంట్లు చేస్తున్నారు. రేప్పొద్దున బెయిల్ రద్దయి జగన్ కూడా మళ్లీ జైలుకుపోయినప్పుడు ఆయన్ని కూడా ఎవరైనా కొడితే ఇలానే సమర్థించుకుంటారా? తన బెయిల్ రద్దై, జైలుకు వెళ్తే, దానికి సంబంధించి రఘురామ సహా ఎవరూ సాక్ష్యం చెప్పకూడదనే సీఎం జగన్ ఇలా కక్ష తీర్చుకుంటున్నాడు'' అని టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి అన్నారు. మరోవైపు..
చంద్రబాబు, జగన్ మధ్యలో రఘురామ
అధికార పార్టీ ఎంపీని సొంత ప్రభుత్వమే అరెస్టు చేయిస్తే విపక్షాలు ఇంతగా హడావుడి చేయడమేంటని వ్యక్తమవుతోన్న అభిప్రాయాలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు జపం చేయనిదే నిద్ర పట్టదని, వైసీపీలో ఉన్న లుకలుకలు, అంతర్గత విబేధాలకు చంద్రబాబుకి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు. నర్సాపురం ఎంపీ టికెట్ రఘురామకు ఇవ్వమని జగన్ కు చంద్రబాబు సిఫార్సు చేసినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రఘురామ కుటుంబీకుల ఆవేదనను కూడా చంద్రబాబుకు అంటగట్టడం అనుచితమని, వైసీపీ ఎంపీలు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే వారి భార్యాపిల్లలు విలపించరా? అని బుద్ధా వెంకన్న నిలదీశారు. గతంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా అరెస్టులు, టీడీపీ కార్యకర్తల అరెస్టులు, హత్యలపై చంద్రబాబు రాష్ట్రపతికి లేఖలు రాశారని, ఆ విషయం ప్రజలకు తెలుసునని బుద్దా వెంకన్న తెలిపారు.
ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు