జగన్కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణ
ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సుమోటోగా నమోదు చేసిన దేశద్రోహం కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. సీఎం జగన్ ను జాతీయ స్థాయిలో బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తూ, పార్లమెంటరీ కమిటీలకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వరుస లేఖలు రాశారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు రఘురామకు మద్దతు తెలపగా, తొలిసారిగా బీజేపీ భాగస్వామిగా ఉండే ఎన్డీఏ నుంచీ వైసీపీ రెబల్ పై స్పందన వెలువడింది. మరోవైపు, జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ కు ఫోన్ బెదిరింపుల ఉదంతంలో రఘురామ ఫిర్యాదుపై ఏపీ సీఐడీ విభాగం కీలక ప్రకటన చేసింది. వివరాలివి..
Recommended Video

థర్డ్ డిగ్రీ, అసెంబ్లీ తీర్మానాలు..
దేశ చరిత్రలో ఒక సిట్టింగ్ ఎంపీపై ఆయనకే చెందిన అధికార పార్టీ ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టడం, అరెస్టు చేసిన తర్వాత కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతం తనకే ఎదురైందంటూ ఎంపీ రఘురామ వాదిస్తుండటం తెలిసిందే. సోమవారం ఆయన అన్ని రాష్ట్రాల(ఏపీ తప్ప) సీఎంలకు రాసిన లేఖల్లోనూ అవే అంశాలను పేర్కొన్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసినందుకే తనపై ఏపీ సర్కారు కక్ష కట్టిందని, ఈ ఉదంతంలో తనకు మద్దతుగా, దేశద్రోహం చట్టాల సవరణ కోసం అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేయాల్సిందిగా సీఎంలను రఘురామ కోరారు. దీనిపై..

వైసీపీ ఎంపీకి అనూహ్య మద్దతు
కేంద్రం పెద్దలు, పార్లమెంటరీ కమిటీలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఎంపీలకు లేఖలు రాయడంతో ఎంపీ రఘురామ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి, తమిళనాడు ఎంపీ అయిన మాణికం ఠాగూర్ సహా పలువురు ఎంపీలు రఘురామ ఇష్యూపై స్పందిస్తూ, ఏపీ సర్కారును, సీఎం జగన్ ను తిట్టిపోశారు. సీఎంలకూ లేఖలు రాసిన తర్వాత ఎంపీ సైతం ఊహించని మలుపు చోటుచేసుకుందంటూ రఘురామ దేశద్రోహం కేసులో ఏ3గా ఉన్న ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ పేర్కొంది.

రఘురామ లేఖపై బిహార్ సీఎం స్పందన..
తన అరెస్ట్, తదనంతర పరిణామాలను వివరిస్తూ అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ రాసిన లేఖలు వృధాగా పోలేదని, ఎంపీ లేఖలను చూసిన నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారని, రఘురామ లేఖకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం స్పందించారని, వైసీపీ ఎంపీ లేఖను బిహార్ సీఎస్, డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శులకు బిహార్ సీఎం కార్యాలయం పంపిందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనంలో పేర్కొంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకుంటోన్న దాదాపు అన్ని నిర్ణయాలకు మద్దతుగా నిలబడుతోన్న ఏపీ సీఎం జగన్ కు.. అదే బీజేపీ నాయకత్వంలో బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి సారధి అయిన నితీశ్ కుమార్.. రఘురామ ఇష్యూలో ఇలా స్పందించడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు జగన్ కు షాక్ లాంటివేననే అభిప్రాయం వెల్లడవుతోంది. ఇదిలా ఉంటే..

పీవీ రమేశ్కు బెదిరింపులు, ట్విస్ట్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఫోన్ నుంచి బెదిరింపు సందేశాలు వస్తున్నాయంటూ మాజీ ఐఏఎస్, జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ రచ్చకెక్కడం, దానిని తీవ్రంగా భావించిన రఘురామ.. ఏపీ సీఐడీకి వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అరెస్టు సమయంలో సీఐడీ పోలీసులు తన ఫోన్ ను అక్రమంగా సీజ్ చేశారని, పీవీ రమేశ్ సోదరికి, సీఐడీ డీజీ సునీల్ కుమార్ కు మధ్య విబేధాలు ఉండటంతో తన ఫోన్ ను అడ్డం పెట్టుకుని పోలీసులే బెదిరింపులకు పాల్పడుతుండొచ్చంటూ రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై..

రఘురామ ఫోన్పై ఏపీ సీఐడీ క్లారిటీ..
నర్సాపురం ఎంపీ రఘురామ ఫోన్ను నిబంధనల మేరకే సీజ్ చేశామని, డీజీ సునీల్ కుమార్పై ఢిల్లీ పోలీసులకు ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు అర్థంలేనిదని ఏపీ సీఐడీ విభాగం పేర్కొంది. ఢిల్లీపోలీసులకు ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ సీఐడీ విభాగం సోమవారం స్పందించింది. ''సీజ్ చేసిన 90009 22222 నంబరుతో మెసెజ్లు పంపారని ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ, ఫోన్ సీజ్ చేసినప్పుడు తన నంబరు 90009 11111గా రఘురామ చెప్పారు. ఫోన్లో ఏ నంబరు ఉందో విచారణాధికారికి తెలిసే అవకాశమే లేదు. ఫోన్ను ప్రాథమిక విశ్లేషణ, డేటా, ఫొటోల డంపింగ్కు ల్యాబ్కు పంపాం. ఫోన్ స్వాధీనానికి సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాం. విశ్లేషన్ చేసిన డేటాను మే 31న గుంటూరు సీఐడీ కోర్టుకు అప్పగించాం. రఘురామ ఫోన్ మే 18 నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ కస్టడీలో ఉంది. కస్టడీలో ఉన్న ఫోన్ను అధికారులు వాడే అవకాశం లేదు. ఎంపీ రఘురామ మాపై తప్పుడు అభియోగాలు చేస్తున్నారు''అని ఏపీ సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications