సాయిరెడ్డిని ఆడేసుకున్న రఘురామ: జగన్ అనుమతి ఉందా?: పార్టీ పేరేంటో తెలుసా? నీవల్లే భ్రష్టు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టినట్టే కనిపిస్తోంది. లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు రూపంలో వైసీపీ మున్ముందు మరిన్ని సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే- తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్కు 24 గంటలు కూడా గడవక ముందే సమాధాలను ఇచ్చిన ఆయన తన లేఖలో లేవనెత్తిన విషయాలు, చేసిన ప్రస్తావనలు అలాంటిలాంటివి కావు. ఏకంగా వైసీపీ పేరునే ప్రశ్నించేలా ఉంది.
ఘాటుగా బదులు..
తాను అందుకున్న షోకాజ్ నోటీసుకు గుంటూరు మిర్చీ ఘాటును కూర్చి మరీ సమాధానం ఇచ్చారు రఘురామ కృష్ణంరాజు. షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చినట్టుగా లేదది. పార్టీపై తిరుగుబాటు జెండా లేవనెత్తినట్టుగా భావించేలా ఉంది. తన అధికారిక లెటర్ ప్యాడ్పై విజయసాయి రెడ్డిని సంబోధిస్తూ రాసిన లేఖలో అన్నీ తూటాల్లాంటి ప్రశ్నలే ఉన్నాయి. షోకాజ్ నోటీస్లో పొందుపరిచిన ఏ ఒక్క అంశానికీ రఘురామ బదులివ్వలేదు. పైగా కొత్త అనుమానాలను లేవనెత్తారు.
సాయిరెడ్డిని సంబోధించడంలోనే తేడా
రఘురామకు తాను జారీ చేసిన షోకాజ్ నోటీసులో సాయిరెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేర్కొన్నారు. దీన్ని తప్పు పట్టారాయన. నేషనల్ జనరల్ సెక్రెటరీ టు స్టేట్ రికగ్నైజ్డ్ రీజినల్ పార్టీగా సాయిరెడ్డిని సంబోధించారు. తనకు షోకాజ్ నోటీసును జారీ చేయడానికి వినియోగించిన లెటర్ ప్యాడ్లో పార్టీ పేరును తప్పుగా పేర్కొన్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నమోదైన వివరాల ప్రకారం.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎక్కడ పేర్కొన్నారని నిలదీశారు. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో మరో రాజకీయ పార్టీ నమోదై ఉందని గుర్తు చేశారు.
జతీయ ప్రధాన కార్యదర్శిగా ఎప్పుడయ్యావు?
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి ఎప్పుడు ఎన్నిక అయ్యారని ప్రశ్నించారు రఘురామ. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉన్న వైసీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎలా చెప్పుకోగలుగుతారని అన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన క్రమశిక్షణ కమిటీకి ఎన్నికల కమిషన్ కార్యాలయం గుర్తింపు ఉందని తాను భావించట్లేదని చెప్పారు. ఒకవేళ అలాంటి గుర్తింపు అంటూ ఏదైనా ఉంటే దాని గురించి తనకు వివరించాలని ఎదురు ప్రశ్న వేశారు.
క్రమశిక్షణా కమిటీకి గుర్తింపు లేదు..
వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా కమిటీకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు లేదని రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పబ్లిక్ డొమైన్లో ఉన్న వివరాల ప్రకారం..తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ కింద పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అధికారం గానీ, చట్టపరమైన అనుమతులు గానీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై తనకు మరిన్ని సందేహాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
జగన్ అనుమతి తీసుకునే ఉంటారని..
తనకు షోకాజ్ నోటీసును జారీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అని ముద్రించిన లెటర్ ప్యాడ్ను వినియోగించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకునే ఉంటారని తాను నమ్ముతున్నానని అన్నారు. ఈ పేరుతో ఎలాంటి అధికారికంగా ఎలాంటి లావాదేవీలను నిర్వహించకూడదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలను తాను మరోసారి గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరు తప్పనిసరిగా పొందుపరాలంటూ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
సమాధానం ఇవ్వడానికి మొహమాటం పడట్లేదు..
పార్టీ క్రమశిక్షణా కమిటీ సమక్షానికి హాజరై తాను షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఎలాంటి మొహమాటం గానీ, భేషజం గానీ లేదని రఘురామ పేర్కొన్నారు. ఆ కమిటీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఆ చట్టబద్ధత లేదనే విషయాన్ని తాను గుర్తు చేస్తున్నానని చెప్పారు. పార్టీ ఉనికిని కోల్పోయేలా ప్రవర్తిస్తున్నారని విజయసాయి రెడ్డిపై ధ్వజమెత్తారు. అలాంటి చర్యలకు పాల్పడొద్దని తాను విజ్ఙప్తి చేస్తున్నానని అన్నారు. పార్టీ విలువలు, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారనిఆరోపించారు.