జగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు
హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన ఫిర్యాదు లేఖ వ్యవహారాన్ని కోర్టు విచారిస్తుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే మూడేళ్ల కిందట వెలువరించిన కీలక తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి ముడిపెడుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాల్లో ఇంకొన్ని ఎదురుదెబ్బలు తగలక ముందే జగన్ అండ్ కో తమ తప్పులు దిద్దుకోవాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ .. ఏపీలో దేవాలయాలు, రిజర్వేషన్లపై ఎంపీ రఘురామ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
జగన్ సిగ్గుపడుతున్నారు -నిమ్మగడ్డకు వైసీపీ కాన్సెంట్ -అకౌంట్లలోకి డబ్బులు: ఎంపీ రఘురామ
జగన్ ధ్వంసరచన..
‘‘రాష్ట్రంలోనే ప్రధాన దేవాలయమైన సింహాచలం అప్పన్న ఆలయానికి సంబంధించి అనువంశిక ధర్వకర్తలైన అశోక్ గజపతిరాజును తప్పించడం ద్వారా ఆలయ భూములు, అలాగే మాన్సాస్ ట్రస్టు ఆస్తులను మింగేయడానికి వైసీపీ కీలక నేతలు కంకణం కట్టుకున్నారు. రాత్రికిరాత్రి తెరపైకి సంచైత గజపతిరాజును తెరపైకి తెచ్చారు. పెంపకం రీత్యా ఆమె క్రిస్టియన్. మొన్న దీపావళి రోజున కూడా తన తండ్రిని రమేశ్ శర్మగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. సింహాచలం, మన్సాస్ ట్రస్టులు సంచైత చేతికి వెళ్లినప్పటి నుంచి సుమారు 36 దేవాలయాల్లో కనీసం ధూపదీపనైవేద్యాలకు కూడా గతిలేదు. తగుదునమ్మా అంటూ మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోని మరిన్ని ఆలయాలకు ఆమెను ట్రస్టీగా నియమించారు. ఏంటీ అరాచకం? ఏం సాధించాలని ఈ తరహాలో ధ్వంసరచనకు దిగుతున్నారు? ఏంటి అరాచకం? కోర్టులు మరోసారి చెంపలు వాయించకముందే సంచైతను ఆ పదవుల నుంచి తొలగించి, ఆలయాలను, భూములను సీఎం జగన్ కాపాడాలి.
అక్రమాలు బయటపెడితే హత్యలు..
ఏపీలో ఆలయాల నుంచి ప్రాజెక్టుల దాకా ప్రభుత్వం సాగిస్తోన్న అక్రమాలపై ప్రశ్నించినవాళ్లను జైళ్లలోకి నెడుతున్నారు. అక్రమాలను బయటపెట్టినవాళ్లను ఏకంగా పైకి పంపేస్తున్నారు. కడప జిల్లా కొండాపురం మండలంలో గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల ప్యాకేజీలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆధారాలతో సహా ఒక విజిల్ బ్లోయర్(మాజీ పోలీస్ అధికారి) బయటపెడితే అతణ్ని కిరాతకంగా హత్య చేయించారు. ఎక్కడికెళుతున్నాం మనం? ఇదేనా జగన్ చేస్తానన్న న్యాయం, ధర్మం? హంతకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మరో ముఖ్యమైన అంశం..
జగన్ కోటరీ స్కెచ్..
పాత ఇసుక పాలసీని సవరించుకుంటామని, సూచనలు చేయాల్సిందిగా ప్రజలను కోరిన ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని కూడా లోపభూయీష్టంగా రూపొందించింది. సీఎం జగన్ కు తెలిసో, తెలియకనో ఆయన కోటరీ భారీ స్కెచ్ వేసింది. రూ.500 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీల నుంచి రూ.50 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని పర్మిషన్లు ఇస్తామంటున్నారు. అయ్యా.. ఇసుక తొవ్వకానికి ఇంటర్నేషనల్ కంపెనీలు అవసరమా? అదేమైనా స్కిల్డ్ ఇంజనీరింగ్ ప్రాజెక్టా? బడా కంపెనీలకు మాత్రమే అవకాశం కల్పించడం ద్వారా ఉచితంగా లభించే ఇసుకను క్యాష్ చేసుకోవాలని జగన్ కోటరీ ప్రణాళికలు వేసింది. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే తప్ప ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరగబోదు..
ఆ ఎమ్మెల్యేపై జస్టిస్ బోబ్డే కీలక తీర్పు..
ఏపీలో అక్రమ వ్యవహారాలకుతోడు రాజ్యాంగ ఉల్లంఘనలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. హిందువులుగా ఎస్సీ రిజర్వేషన్ పొందుతూ, క్రైస్తవమతంలో కొనసాగుతోన్న వాళ్ల వివరాలను 2021 జనాభా లెక్కల్లో తేల్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాను. ఏపీలోని చర్చి పాస్టర్లలో 65 శాతం మందికి ఎస్సీ సర్టిఫికేట్లున్నాయి. మతమార్పిడులకు సంబంధించి ప్రస్తుత సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే.. మూడేళ్ల కిందట(అప్పుడాయన సీనియర్ జడ్జిగా ఉన్నారు) ఓ కీలకమైన తీర్పు చెప్పారు. పంజాబ్ లో ఒక సిక్కు ఎమ్మెల్యే ముస్లిం మతంలో కొనసాగుతూ, సిక్కులు లభించే ఎస్సీ రిజర్వుడు స్థానంలో పోటీచేసి గెలిచాడు. రాజ్యాంగంలోని 25 అధికర ప్రకారం ఎవరికైనా మతం మార్చుకునే హక్కుంది. కానీ ఇతర మతంలో ఉన్నప్పుడు వ్యక్తుల రిజర్వేషన్లకు గ్రహణం ఏర్పడుతుందని, మళ్లీ ఆ వ్యక్తులు తిరిగి మూల మతంలోకి మారితే అప్పుడు రిజర్వేషన్ వర్తిస్తుందని తీర్పు చెబుతూ, సదరు ఎమ్మెల్యేను డిస్ క్వాలిఫై చేశారు. ఏపీలోనూ అలాంటి వ్యక్తులందరూ తిరిగి హిందువులుగా మారితే రిజర్వేషన్లు అనుభవించొచ్చు. ఏపీలో జనాభా లెక్కల్లో మత గణన కూడా జరగాలనే దిశగా కోర్టు డైరెక్షన్ రావాల్సిన అవసం ఉంది'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు.
Recommended Video
చంద్రబాబు ముందుచూపు -పనబాక లక్ష్మికే టీడీపీ టికెట్ -బీజేపీకి చెక్ -రసవత్తరంగా తిరుపతి బైపోల్