కడప జిల్లాకు వైఎస్సార్ పేరేంటి? - మద్యనిషేధం ఫెయిల్యూర్ -పిల్లలతో అఫిడవిట్లా?: ఎంపీ రఘురామ
సొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పర్వం కొనసాగుతున్నది. అనర్హత పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉండగా, పార్టీ నుంచి ఎదురుదాడి తగ్గిన క్రమంలో ఎంపీ మాత్రం రోజురోజుకూ సౌండ్ పెంచుతూ వెళుతున్నారు. 'రాజధాని రచ్చబండ' పేరుతో వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తోన్న ఆయన గురువారం 'వైఎస్సార్ కడప' జిల్లా పేరును ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలుచేశారు. ఏపీలో మద్య నిషేధం, ఇంగ్లీష్ మీడియం అమలుపైనా ఇలా మాట్లాడారు...
మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -'ట్రావెన్కోర్' ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్
కడప పేరు కేవలం వైఎస్సారా?
‘‘గతంలో రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు, దివంగత నేతకు గుర్తుగా, కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చారు. కానీ జగన్ మీడియాలో మాత్రం దాన్ని ‘వైఎస్సార్ జిల్లా' అని మాత్రమే రాస్తున్నది. మరి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విషయంలో ఎలా వ్యవహరిస్తున్నా పట్టింపులేదు. అసలు కడప జిల్లాకు ఆపేరు ఎందుకొచ్చింది? ఆ పేరు తీసేసే అర్హత మీకుందా? కడపోళ్లకు ఇది ఇష్టమేనా? కడప అంటే దేవుని గడప. వెంకటేశ్వరస్వామికి తొలి గడపే.. కడపగా మారింది. అలాంటి పేరును మీరు మొత్తానికే మార్చేయడం కరెక్టుకాదు. దీనిపై కడప ప్రజలే ముందుకు కదలాలి. కడప పక్కనే..
పిల్లలతో పిల్స్..
కడపకు 30 మైళ్ల దూరంలోని తాళ్లపాకలో కీర్తనకారుడు అన్నమయ్య జన్మించారు. తెలుగుభాషకు ప్రాశస్యం తీసుకొచ్చిన అన్నమయ్య పుట్టిన కడపలో పుట్టిన జగన్.. ఇవాళ భాషను చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంపై కోర్టు తీర్పు ఈ వారం రావాల్సి ఉండగా మళ్లీ ఏదో తెలివైన స్కెచ్ వేశారు. ఇంగ్లీషే కావాలని చిన్నపిల్లలతో అఫిడవిట్ ఫైల్ చేయించినట్లు తెలిసింది. ఒకరిద్దరు పిల్ వేసినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చడం కుదరదని సీఎం తెలుసుకోవాలి. వీలైతే భాషను బతికించాలిగానీ, ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు మంచిదికాదు.
ఇచ్చింది 70.. ప్రచారానికి 80..
ఏపీలో రకరకాల స్కీములకు విడతలుగా ఇస్తున్నప్పుడు.. ప్రతిసారి సాక్షి సహా పలు మీడియాల్లో భారీగా ప్రకటనలు ఇస్తున్నారు. అసలే ఖజానా బోసిపోయిన సందర్భంలో ఇలాంటి ప్రకటనలు అవసరమా? దీన్ని ప్రజలు కూడా ప్రశ్నించాలి. ఇటీవల పలు జిల్లాల్లో వరద బాధితులకు సీఎం రూ.70 లక్షల సాయం ప్రకటించారు. అయితే ఆ సాయం గురించి పేపర్లో ప్రకటనకు రూ.80 లక్షలు ఖర్చయినట్లు తెలిసింది. అంటే, ప్రజలకు ఇచ్చిన దానికంటే పేపర్లకు ఇస్తున్నదే ఎక్కువ. దీంతో ప్రజాధనం వృధా అవుతోంది. ఏపీని పడీస్తోన్న మరో సమస్య..
బస్సులు ఆపి బాటిళ్ల కోసం చెకింగ్స్..
ఏపీలో లిక్కర్ సమస్య తీవ్రస్థాయికి చేరింది. ఒక వ్యక్తి బయటి నుంచి రెండు బాటిళ్లు కొనొచ్చని కోర్టు చెప్పింది. కానీ ఏపీ సర్కారు మాత్రం చెప్పేదొకటి, చేసేదొకటి. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని మేం మేనిఫెస్టోలో పెట్టాం. బెల్టు షాపులు తగ్గాయి. కానీ మద్యం ద్వారా ఆదాయం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే మద్యం అందుబాటులో లేక ధరలు పెరిగాయి. నలుగురైదుగురు వ్యక్తులకు లబ్ది జరిగేలా సర్కారు వ్యవహరిస్తోంది. పక్కా ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు మాత్రం లారీలకు లారీలు మద్యం లోడ్లు తెప్పిస్తున్నారు. దాన్ని వదిలేసి, సామాన్యులు ఒకటి రెండు బాటిళ్లు తెచ్చుకుంటున్నారని బస్సులు ఆపి, ఆడవాళ్ల బ్యాగులు సైతం చెకింగ్ చేస్తున్నారు.
బీహార్లో మహిళల కోపం దీనిపైనే..
బీహార్ ఎన్నికల ఫలితాలు మొన్నటిదాకా వన్ సైడ్ అన్నారు. కానీ ఇప్పుడు టైట్ సిట్యువేషన్ అంటున్నారు. దానికి కారణమేంటంటే.. బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం పెట్టారు. కానీ తాగే వాడు మందు మానలేదు. దీంతో మద్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది.. ఈసారి రేటు విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై అక్కడి మహిళలు ఆగ్రహంగా ఉన్నారు. గాంధీ పుట్టిన చోటు కాబట్టి గుజరాత్ లో సంపూర్ణ మద్య నిషేధం ఉంది. కానీ పక్క రాష్ట్రంలో కొనుక్కొని రావొద్దనే రూల్ దేశంలో ఎక్కడా లేదు. గాంధీ గారు మళ్లీ పుట్టారని జగన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు వ్యాసాలు రాసిన నేపథ్యంలో మనం కూడా ఆదర్శాలను ఫాలో అయితే మంచిది. నిజానికి ప్రపంచంలో మద్యనిషేధం అనేది ఎక్కడా సక్సెస్ కాలేదు. అదొక ఫెయిల్యూర్ ఐడియా. అదీగాక.. భారతదేశంలో అమ్ముడుపోయే మొత్తం మద్యంలో 50 శాతం దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల్లోనే ఉంది. మద్యనిషేధం అన్నప్పుడు క్రమంగా తగ్గించే ప్రయత్నం చేద్దాంకానీ. ముగ్గురు నలుగురు వ్యక్తుల వ్యాపారాన్ని పెంచడానికే ప్రయత్నించడం సరికాదు.
చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్ - కేంద్రానికి ఏం రాశారో గుర్తుందా?: అంబటి రాంబాబు సంచలనం
సుప్రీం తీర్పు.. చెంపపెట్టు..
రాజకీయాల్లో అవినీతి, వారసత్వ జాఢ్యంపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన సందేశం ఇచ్చారు. అవినీతి పరులు కోర్టులను ప్రశ్నిస్తోన్న సందర్భంలో ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. బీజేపీకి కేంద్రంలో ఎంత బలమున్నా, కోర్టుల విషయంలో కలుగజేసుకోబోదు. ఉత్తరాఖండ్ లో బీజేపీ సీఎంపై అవినీతి ఆరోపణలకు సంబంధించి నైనితాల్ హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వంపై విమర్శలు చేసినంత మాత్రాన వ్యక్తులపై కేసులు పెట్టడం సరికాదన్న సుప్రీం తీర్పు చాలా మందికి చెంపపెట్టులాంటిది. జనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి జగన్ సర్కారుపై నేను మాట్లాడటం తప్పేమీకాదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.