ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు- వైసీపీ నుంచి రక్షించాలని కేంద్రానికి వేడుకోలు...
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ అధిష్టానం, నేతలపై కత్తులు దూస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పోరును ఢిల్లీకి తీసుకెళ్లారు. కొంతకాలంగా పార్టీ నేతల నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన కేంద్రాన్ని ఆశ్రయించనున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంశాఖ అధికారులతో పాటు మంత్రులను కూడా కలుసుకోనున్నారు. అలాగే ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి వైసీపీ తీరుపై ఫిర్యాదు చేయనున్నారు.
ప్రధానంగా సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న బెదిరింపుల దృష్ట్యా తనకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖను రఘురామకృష్ణంరాజు కోరనున్నారు. అలాగే తన నియోజకవర్గ పర్యటనల్లో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరబోతున్నారు. అయితే ఆయన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వైసీపీ నేతలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఎదురవుతున్న అవమానాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ మరోసారి ఆయన్ను కలిసే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల కమిషన్ అధికారులను కూడా కలిసి వైసీపీపై ఎంపీ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్న రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఢిల్లీ బాట పట్టడంతో వైసీపీ నేతల్లోనూ ఏం జరగబోతోందన్న అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.