జస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు
హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై అతితీవ్ర, అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, కోర్టు ధిక్కారం కింద అతి త్వరలోనే సీఎం బుక్ అవుతారని నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. 'రాజధాని రచ్చబడ్డ' కార్యక్రమంలో భాగంగా బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబీకుల భూముల వివరాలు, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, వైసీపీ అనుసరిస్తోన్న విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
జడ్జిలపై జగన్ ఫిర్యాదు: నారా లోకేశ్ తీవ్ర స్పందన - 'ఆంధ్ర ఎస్కోబార్' అంటూ టీడీపీ ఫైర్
నూతలపాటి వంశీకులది ఆ ప్రాంతమే
‘‘ఏపీ సీఎం జగన్ జడ్జిలపై చేసిన ఆరోపణల్లో ప్రధానమైనది నూతలపాటి (వెంకటరమణ(ఎన్వీ రమణ) వంశీకుల భూములకు సంబంధించింది. నూతలపాటి వంశీకులది కృష్ణాజిల్లా నందిగామ, కంచికచర్ల ప్రాంతం. ఆ వంశానికి చెందిన ఆడబిడ్డలు(జస్టిర్ రమణ పిల్లలు) తమ సొంత ఊరైన కంచికచర్లలోనే భములు కొనుక్కున్నారు. అది రాజధాని ప్రాంతం కానేకాదు. భవిష్యత్ అవసరాల కోసం.. అమరావతి నుంచి చుట్టూ 60 కిలోమీటర్ల మేర.. క్యాపిటల్ రీజియన్ అని నిర్ధారించేతప్ప.. నందిగామ, కంచికచర్ల రాజధాని కానేకావు. అలాంటి చోట.. అది కూడా తమ సొంత ప్రాంతంలో జడ్జిల పిల్లలు స్థలాలు కొనడం తప్పెలా అవుతుంది? కళ్లుండీ చూడలేని సలహాదారుల పిచ్చి సలహాలు విని సీఎం జగన్ సీజేఐకి లేఖ రాస్తే దాని మీద జాతీయ మీడియాలో కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారు. జడ్జిల పిల్లలు భూములు కన్నది కంచికచర్లలో మాత్రమేనని, అది కూడా చట్టబద్ధంగానే కొన్నారని అందరూ గుర్తుంచుకోవాలి..
1961లో సంజీవయ్య ఇలా చేయలేదు..
సీఎం లేఖ రాసిందే తడవుగా, ఆయన సలహాదారులు మీడియాకు లీకులు ఇవ్వడం, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న తరుణంలోనే వైసీపీకి చెందిన కొందరు కుహనా మేధావులు.. 1961 నాటి దామోదరం సంజీవయ్యగారి అంశాన్ని తెరపైకి తెచ్చారు. నాటి ఏపీ సీఎం సంజీవయ్య.. అప్పటి కేంద్ర హోం మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి లేఖ రాసిన విషయాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అప్పట్లో సంజీవయ్యగారు న్యాయవ్యవస్థ మీద దాడికి పాల్పడలేదు. కొందరు రెడ్డి వ్యక్తుల మీద అభిశంసన మాత్రమే కోరారు. అది కూడా తన లేఖను రహస్యంగా ఉంచారేతప్ప జగన్ లాగా బట్టబయలు చేయలేదు. అయినప్పటికీ సంజీవయ్య ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు జగన్ లేఖతో కూడా ఏమీ జరగదు. ఇవన్నీ పిచ్చి ప్రయత్నాలు తప్ప మరొకటి కావు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్లుగా సంజీవయ్య.. జడ్జిపై ఫిర్యాదును రహస్యంగా ఉంచుకుంటే, ఇవాళ జగన్ అనైతికంగా లేఖను లీక్ చేశారు. ఇది ముమ్మాటికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికే వస్తుంది..
21 మంది ఎంపీలతో ఏం చేయగలరు?
జడ్జిలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ వల్ల.. వారిపై అభిశంసన తప్ప మరో మార్గంలో దూషించడానికి వీల్లేదు. వైసీపీకి ఉన్న 21 మంది ఎంపీలతో పార్లమెంటులో జడ్జిలపై అభిశంసన కుదరదు. దీనికి ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వదు. తెలంగాణ మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయ కోవిదుడు రామకృష్ణారెడ్డి స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఏపీ సీఎం చర్య కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, దీన్ని సుప్రీంకోర్టు వెంటనే విచారించాలని కోరారు. జాతీయ చానెల్ డిబేట్ లో నేను కూడా ఇదే విషయం చెప్పాను. ఎక్కడో రాజధానికి దూరంగా కొన్న భూములపై ఇలా వివాదాలు సృష్టించడం, జడ్జిలపై కావాలని బురద చల్లడం సరైంది కాదంటున్నాను.
రాష్ట్రపతికి లేఖ రాశాను..
ఏపీలో అస్తవ్యస్థమైన పరిపాలన, న్యాయవ్యవస్థపై దాడి సమర్థనీయం కాదని, ఇది కొనసాగితే దేశంలో కోర్టులు పనిచేయలేని పరిస్థితి వస్తుందని నా వ్యక్తిగత స్థాయిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారికి లేఖ రాశాను. జాతీయ మీడియాలో కొందరు పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడటం తప్ప అసలీ వ్యవహారంలో పస లేదు. రక్షకుడే తక్షకుడైన చందంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రికంటే.. జడ్జిలకే రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందన్నది వంద శాతం వాస్తవం. జాతీయ మీడియా కూడా దీన్ని గుర్తించాలి. ఒకవేళ న్యాయాన్ని కాపాడలేకుంటే మూసుకుని కూర్చోవాలిగానీ, అన్యాయానికి కొమ్ముకాయొద్దు'' అని ఎంపీ రఘురామ అన్నారు.
Recommended Video
జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ