షాకింగ్: 6నెలల్లో జగన్ 114 శాతం అప్పులు -కేసీఆర్తో చర్చలు -ఏపీ పోలీసులపైనా వైసీపీ ఎంపీ ఆరోపణలు
అనర్హత వేటు అంశం ఎటూ తేలకపోవడం.. ఎన్ని మాటలు అంటున్నా వైసీపీ మౌనం వహిస్తుండటంతో ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజురోజుకూ విమర్శల దాడిని ముమ్మరం చేస్తున్నారు. కొద్ది నెలలుగా ఢిల్లీలోనే మకాం వేసి, 'రాజధాని రచ్చబడ్డ' పేరిట ప్రెస్ మీట్లు నిర్వహిస్తోన్న రఘురామ.. వైసీపీ సర్కారుపై, సీఎం జగన్ పై పలు ఆరోపణలు చేశారు. తాజాగా ఏపీ పోలీల తీరుపైనా కామెంట్లు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ఆర్థిక పరిస్థితిపైనా కొన్ని విషయాలు చెప్పారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
ప్రవీణ్ ప్రకాశ్ దానికి పనికిరాడు -ఇవిగో ఆధారాలు -ఏపీకి అనర్ధం -మళ్లీ ఎదురుదెబ్బ: ఎంపీ రఘురామ
ఇచ్చేది రూ.20.. లాగేది రూ.50
‘‘ఆంధ్రప్రదేశ్ లో మద్యం అక్రమాలపై ఇటీవల నేను కొన్ని పాయింట్లు లేవనెత్తాను. కొద్ది గంటల కిందటే మద్యం ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ పేదలు తాగే మద్యం బ్రాండ్ల క్వాలిటీ విషయంలో మాత్రం మార్పుల్లేవు. సంపూర్ణ మద్య నిషేధమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతన్నది. కానీ, గతంలో మొత్తం ఆదాయంలో మద్యం అమ్మకాల వాటా 33 శాతం ఉండగా, ఇప్పుడది 47 శాతానికి పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటేలా ఉండటమే దీనికి కారణం. రాష్ట్రంలో ఒక్కో పేద కుటుంబానికి పథకాల ద్వారా రూ.20 వేలు ఇస్తోన్న ప్రభుత్వం.. పన్నులు, అధిక మద్యం ధరల రూపంలో రూ.50వేలు వసూలు చేస్తోందని, ఇచ్చినట్లే ఇచ్చే మళ్లీ లాక్కోవడమే కాకుండా, రూ.30వేలు అదనంగా దోచుకుంటున్నామని వాట్సప్ మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ లెక్కలు నేను వేసినవి కానప్పటికీ, సీఎం ఓ సారి పరిశీలించాలని కోరుతున్నా. ప్రభుత్వ ఖజానా విషయంలో ఇక్కడో ముఖ్యమైన పాయింట్ చెప్పుకోవాలి..
ఆరు నెలలకే అదనపు అప్పు..
వైసీపీ పట్ల, సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఇమేజ్ పడిపోయింది. దాన్ని తిరిగి నిలబెట్టుకోడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్క ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' సంస్థకే రూ.8.5 కోట్ల చెక్కును అందజేశారు. పార్టీ ప్రచారం కోసం ప్రజల డబ్బులు వాడుకోవడం ఎంతవరకు సబబు? ఇటీవల వెలుగులోకి వచ్చిన కాగ్ రిపోర్టులోనూ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కీలక విషయాలు వెల్లడయ్యాయి. జగన్ ప్రభుత్వ పరంగా ఏడాదిలో చేయాలనుకున్న అప్పుకు 114 శాతం అదనంగా గడిచిన ఆరు నెలల్లోనే చేసినట్లు లెక్కలొచ్చాయి. ఖజానా ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఇమేజ్ బిల్డప్ ప్రకటనల కోసం కోట్లు ఖర్చు పెట్టడం సరైందా? జాతీయ స్థాయిలో ప్రచారం పొంది, జగన్ ప్రధాని కావాలనుకోవడం తప్పులేదు.. కానీ అందుకోసం జనం సొమ్ముతో ప్రకటనలు వద్దు.
నంబర్ లేని లారీతో గుద్ది..
ఓ సీనియర్ జర్నలిస్టును నంబర్ లేని లారీతో గుద్ది చంపుతామని మల్యాద్రి రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు దిగాడు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు అనుచరుడిగా చెప్పుకునే ఈ మాల్యాద్రిపై నేను కూడా గతంలో ఫిర్యాదు చేశాను. లారీతో గుద్దితేనో, ఇంకేదో చేస్తేనే భరించడానికి మేం వారికి బంధువులం లేదా బాబాయిలం కాదు. ఇప్పుడా బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడుతుననాడు. ఎందుకంటే.. ఫిర్యాదు చేసినవాళ్లపైనే ఉల్టా కేసులు పెడుతోన్న వైనం ఏపీలో కొనసాగుతోంది. వాస్తవం ఇలా ఉంటే, కేంద్రం మాత్రం ఏపీ పోలీసులకు భారీ ఎత్తున అవార్డులు ఇస్తూ పోతున్నది. కేంద్ర అవార్డులతోపాటు ఏపీ ప్రజల హృదయాలను కూడా గెలుచుకోవాలని పోలీసులను కోరుతున్నాను. పోలీసులు కోరితే అన్ని వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదులపై ఏపీ పోలీసులు సరిగా స్పందించలేదు. అంతెందుకు, కోర్టు ఆదేశించిన తర్వాత కూడా అరెస్టులు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించొచ్చు. ఇకపోతే..
Recommended Video
కేసీఆర్తో చర్చలకు రెడీ..
రాష్ట్రాలు విడిపోయినా, ఏపీకి చెందిన లక్షలాది మంది హైదరాబాద్ లోనే పని చేస్తున్నారని తెలిసిందే. అద్భుతమైన మెజార్టీ కలిగిన ఏపీ సర్కారు.. కనీసం హైదరాబాద్ కు బస్సులు నడుపుకోలేని దుస్థితిలో ఉండటం శోచనీయం. మొన్న దసరా పండుగకు ఇళ్లకు రావడానికి జనం తీవ్రంగా బాధపడ్డారు. రాబోయే రోజుల్లో ఏపీకి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. మరి బస్సుల సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపాల్సిందే. అవసరమైతే కేసీఆర్ సర్కారుతో మాట్లాడటానికి నేను రెడీగా ఉన్నాను. రచ్చబండ కార్యక్రమం రాబోయే రోజుల్లో విశాఖపట్నం కథలు, వ్యధలను చెప్పుకుందాం..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు ముగించారు.
కడప జిల్లాకు వైఎస్సార్ పేరేంటి? - మద్యనిషేధం ఫెయిల్యూర్ -పిల్లలతో అఫిడవిట్లా?: ఎంపీ రఘురామ