షర్మిల పార్టీ గుట్టు విప్పిన రఘురామ -ఎన్టీఆర్లా జగన్ -అనిల్ బాణం -కర్ణాటక, తమిళనాడులో సక్సెస్
కొత్త ఏడాదిలో తెలంగాణ రాజకీయాలపై కొనసాగుతోన్న చర్చలను మరింత తీవ్రతరం చేస్తూ, కొత్త పార్టీ స్థాపించే దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరిగా, అంతర్జాతీయ సువార్తీకుడు బ్రదర్ అనిల్ భార్యగానే కాకుండా సొంతగా విల్ పవర్ ఉన్న నాయకురాలిగా షర్మిలకు పేరుంది. ఏపీలో అన్నను ఆటంకపర్చకుండా, తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ పుంజుకుంటుండటం, కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కొందరు రెడ్డి నేతలు తీవ్రంగా శ్రమిస్తుండటం, గులాబీ సైన్యంలోనూ దళపతి మారాలన్న డిమాండ్.. లాంటి అంశాల నడుమ షర్మిల నిర్ణయం సంచలనం రేపుతోంది. దీనిపై..
షర్మిల పార్టీపై రఘురామ స్పందన..
వైఎస్సార్ తనయగా, తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనకే సిద్ధమయ్యానంటూ కొత్త పార్టీ ఏర్పాటుపై కుండబద్దలు కొట్టిన వైఎస్ షర్మిల ప్రకటనపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. షర్మిల కొత్త పార్టీకి సంబంధించిన అనేక నిగూఢ విషయాలను చెప్పుకొచ్చారు. షర్మిల బాణం అయితే.. దాన్ని పట్టుకున్న విల్లు ఎవరిదో, ఆమె ఎవరి చేతిలో బాణమో ఎంపీ రఘురామ తన దగ్గరున్న సమాచారాన్ని అందించారు. అంతేకాదు, రాజకీయాల్లో రాణించడానికి షర్మిలకు ఓ కీలకమైన సలహాను కూడా అందించారు. షర్మిల కొత్త పార్టీపై ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
అదను చూసి దెబ్బకొట్టిన మోదీ -కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్ పదవి గల్లంతు -జమ్మూకాశ్మీర్ అనాధ
అనిల్ వదిలిన బాణం
''ఇవాళ(ఫిబ్రవరి 9) వైఎస్సార్, విజయమ్మల పెళ్లిరోజు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకునే వైఎస్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఆరంభించారు. ఆమె ఏపీ సీఎం సోదరి కావడంతో సహజంగానే జగన్ పై కూడా చర్చ జరుగుతుంది. అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు వచ్చిన కారణంగానే కొత్త పార్టీ ఏర్పడబోతోంది అనే వాదన నూరుశాతం అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు షర్మిల.. జగన్ వదిలిన బాణం కాదు. అలాగనీ జగన్ వదిలించుకున్న బాణం కూడా కాదు. అలాగని జాతీయ స్థాయి నుంచి ప్రయోగం చేస్తోన్న బాణం అవునని కూడా చెప్పలేం. ఎందుకంటే జాతీయ స్థాయి బాణం అయితే దాని గురి ఏపీ అవుతుందేగానీ, తెలంగాణ కాబోదు. నాకున్న సమాచారం ప్రకారమైతే షర్మిల ఇప్పుడు బ్రదర్ అనిల్ వదిలిన బాణం అనే చెప్పొచ్చు. ఎందుకంటే..
జగన్ -షర్మిల మధ్య విభేదాలు
కొత్త పార్టీ పెట్టబోతున్నారు కదాని షర్మిల, జగన్ ల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నాయని ఎవరైనా భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అన్నాచెల్లళ్ల మధ్య చాలా అద్భుతమైన, గాఢమైన అనుబంధం ఉంది. సిస్టర్ సెంటిమెంటుపై వచ్చిన 'రక్తసంబంధం' సినిమాలో ఎన్టీఆర్, సావిత్రిల కంటే కూడా జగన్-షర్మిల మధ్య బాండింగ్ ఉంది. అయితే, కొత్త పార్టీ విషయంలో మాత్రం షర్మిల తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. అందుకే అన్నయ్య వద్దని చెప్పిన తర్వాత కూడా ముందుకే కదిలింది. రాజన్న రాజ్యం తెస్తానంటోన్న ఆమె.. వైఎస్సార్ చిత్రపటంతో తెలంగాణలో రాణించడం దాదాపు అసాధ్యం. అందుకు..
వైఎస్ పేరుతో ఓట్లు పడతాయా?
తెలంగాణ ఊరికే ఏర్పాటైన రాష్ట్రం కాదు, అక్కడి ప్రజలు పోరాడి సాధించుకున్నది. వైఎస్ బతికున్న రోజుల్లో తాను రాష్ట్ర విభజనకు పచ్చి వ్యతిరేకినని చెప్పడమేకాదు.. తెలంగాణ వస్తే ఏపీ వాళ్లు వీసాలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యలు చేశారు. చనిపోయేవరకూ తెలంగాణ పట్ల వైఎస్ తన స్టాండ్ మార్చుకోలేదు. ఆయన తదనంతరం కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చింది. కానీ ఇచ్చినవాడికంటే తెచ్చినవాడే గొప్పోడని జనం భావించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో వైఎస్ బొమ్మతో షర్మిల ఎలా రాణిస్తుంది? అలాగైతే వైఎస్సార్ ఆశయమైన సమైఖ్యాంద్ర నినాదం ఏం కావాలి. అసలు షర్మిల పార్టీకి తెలంగాణలో ఓట్లు వస్తాయని ఆశించడమే ఆశ్చర్యకరంగా ఉంది. దానికంటే..
ఏపీలో అంతా అయిపోయింది..
షర్మిల కొత్త పార్టీకి కార్యక్షేత్రంగా తెలంగాణను ఎంచుకోవడం అనేదే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె వెనుక జాతీయ పెద్దలు ఉన్నట్లయితే టార్గెట్ ఏపీ కావాలేగానీ, తెలంగాణ కాకూడదు కదా? కాబట్టి ఇది పూర్తిగా బ్రదన్ అనిల్ విల్లుధారిగా వ్యవహరిస్తోన్న విషంగానే నేను భావిస్తున్నాను. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటోన్న షర్మిల.. ఏపీలో అది సాధ్యమైందా? అంటే అనుననే అంటారు. వైఎస్ తనయుడు జగన్ రాజ్యం చేస్తోన్నారు కాబట్టి ఏపీ ఆటోమెటిగ్గానే రాజన్న రాజ్యం అయిపోతుందని ఆమె భావన కావొచ్చు. స్వతహాగా కష్టపడే తత్వం షర్మిలది. అన్న జైలులో ఉన్న సమయంలో ఆమె 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నా నియోజకవర్గం నర్సాపురంలోనే ఆరుకుపైగా మీటింగ్స్ పెట్టారు. నిజానికి వైసీపీ గెలుపులో ఆమె పాత్ర తీయరానిది. కానీ మా పార్టీ నేతలు ఆ మేరకు సరైన గుర్తింపు ఇవ్వరు. అలాగని ఆమెకు అన్నతో విభేదాలు మాత్రం లేవు. అయితే..
కర్ణాటక, తమిళనాడులో షర్మిల సక్సెస్..
ఏపీలో అన్న ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఇబ్బందుల్లేకుండా తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని షర్మిల భావిస్తున్నారు. జగన్ తో సంబంధం లేకుండా షర్మిల సొంతగా తన భర్తతో కలిసి తీసుకున్న ఈ నిర్ణయం... తెలంగాణలో వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ. సమైక్యవాది వైఎస్సార్ ఫొటో పెట్టుకుని తెలంగాణలో ఓట్లు రాబట్టొచ్చనే ప్రయత్నం కంటే, షర్మిల తనకున్న పట్టుదలతో కర్ణాటకలోనో, తమిళనాడులోనో కొత్త పార్టీ పెడితే గనుక కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. కనీసం తెలంగాణలో కంటే ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ ఓట్లు వస్తాయని నేను నమ్మకంగా చెప్పగలను'' అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.