డాక్టర్ శిల్పారెడ్డికి జగన్ పదవి అందుకేనా? -పోలవరం ఎత్తు తగ్గింపు -విశాఖలో సునామి: ఎంపీ రఘురామ
అనర్హత వేటు అంశం ఇంకా తేలకపోవడంతో ఇప్పటికీ అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతోన్న రఘురామకృష్ణంరాజు.. సొంత పార్టీపై, అధినేత సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు, అనూహ్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా పోలవరం ఎత్తు తగ్గింపు, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశాలపై నర్సాపురం ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన తెలంగాణ బీజేపీ నేత కీలకంగా వ్యవహరిస్తున్నారని, సదరు నేత భార్య ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారని రఘురామ చెప్పుకొచ్చారు. ఆదివారం 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో మాట్లాడుతూ ఎంపీ అనేక విషయాలు చెప్పారు.
కూతురి మాటలకు, పీవీ బతికుంటే ఆత్మహత్య -సీపీఐ నారాయణ సంచలనం -ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ నాగేశ్వర్
పోలవరం ఎత్తు తగ్గింపు..
ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల అనుమానాలు, నీలినీడలు పెరిగిపోయాయని, విభజన హామీల్లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరానికి తుది అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లుకాగా, దానికి కేంద్రం ఇంకా ఆమోదం తెలపలేదని, తొలిసారిగా ప్రాజెక్టు పనుల నాణ్యతపై కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య అనుమానాలు, అసంతృప్తి వ్యక్తం చేశారని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడానికి చాలా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసిందని, ఈ వ్యవహారాలన్నీ తెలంగాణకు చెందిన బీజేపీ నేత, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె ఆధ్వర్యంలో నడుస్తున్నాయని రఘురామ పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా..
ఎత్తు తగ్గాకే అంచనాలకు ఆమోదం?
పోలవరం ఎత్తు తగ్గింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని, ఎత్తు తగ్గింపునకు ఏపీ సీఎం జగన్ తో మాట్లాడానని కేసీఆర్ పేర్కొన్నారని, ఇప్పుడు అదే తెలంగాణకు చెందిన బీజేపీ నేత వెదిరె శ్రీరాం.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతల్లో ఉంటూ పోలవరంపై ప్రయత్నాలు చేస్తున్నారని, ఎత్తు తగ్గింపు ద్వారా ప్రాజెక్టు వ్యయం రూ.10వేల కోట్లు తగ్గుతుందనే వాదనకు ఏపీ సర్కారును ఒప్పించే బాధ్యతను ఆయన తలెత్తుకున్నట్లు తెలుస్తోందని వైసీపీ రెబల్ ఎంపీ వివరించారు. ఎత్తు తగ్గింపుతో మారే అంచనాలకు కేంద్రం అనుమతి సులభంగా లభిస్తుందనే తరహాలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్, 2022లోగా ప్రాజెక్టు పూర్తయిపోతుందన్న మంత్రి అనిల్ కుమార్ సమాధానం ఇవ్వాలని, సలహాదారుగా శిల్పారెడ్డి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రఘురామ అన్నారు. ఇదే అంశంపై..
టీబీజేపీతో జగన్ మిలాఖత్..
తెలంగాణలో రాజకీయపరమైన లబ్ధి కోసం బీజేపీలోని ఓ వర్గం నేతలు.. పోలవరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్నారని, గోదావరి జలాలను తెలంగాణ భూభాగం ద్వారా తరలించేందుకు కేసీఆర్ దగ్గర జగన్ తలూపి వచ్చారని, స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా చేతులు కలిపేందుకు జగన్ సిద్ధపడ్డారని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. శనివారం ఓ టీవీ చానెల్ చర్చా వేదికలో ఆయనీ కామెంట్లు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే భవిష్యత్తులో నీటినిల్వ, కేటాయింపులపై ప్రభావం పడుతుందని, తెలంగాణలో తనకున్న వేలకోట్ల రూపాయల ఆస్తులు కాపాడుకోవడానికే జగన్ ఈ దుస్సాహసానికి ఒడిగట్టారని పట్టాభి ఆరోపించారు. ఇదిలా ఉంటే..
విశాఖలో సునామీ హెచ్చరిక..
ఏపీలో రాజధాని అమరావతి, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించినట్లే ప్రజలంతా ఏకమై పోలవరం ప్రాజెక్టు కోసమూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బయటి నుంచి వచ్చినవాళ్లను ఎంతగానో ఆదరించిన విశాఖలో ఎన్నడూ లేనిది ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ విభేదాలు వస్తున్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో వైసీపీ మోసానికి పాల్పడిందనే భావన ప్రజల్లో పేరుకుపోయిందని, స్టీల్ ప్లాంటుపై మోసాలకు తోడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరుగుతోన్న భూదందాలపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆ ఆగ్రహం అలలుగా పోటెత్తి, సునామీగా మారే అవకాశం ఉందని రఘురామ అన్నారు. ఆ ఉధృతిలో కొట్టుకుపోక ముందే వైసీపీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీఎం స్వయంగా ఢిల్లీకి వెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని రెబల్ ఎంపీ సూచించారు. ఇక..
ఏపీలో రెడ్లస్వామ్యంపై కోర్టుకు..
సొంత నియోజకవర్గం నర్సాపురం పర్యటనకు వెళ్లాలనుకున్న తనను సొంత వైసీపీ ప్రభుత్వమే అడ్డుకుంటోందని, వరుసకు బాబాయి అయ్యే మంత్రి శ్రీరంగనాథరాజు, సీఎం బాబాయి వైవీ సుబ్బారెడ్డిలు అక్రమంగా కేసులు బనాయించారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. రాజ్యాంగం తనకు రక్షణ కల్పిస్తుందని, ప్రభుత్వ నేతల తీరు, పోలీసు కేసుల వ్యవహారంపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడంతోపాటు కోర్టును కూడా ఆశ్రయిస్తానని ఎంపీ తెలిపారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం లేదని, రెడ్డిస్వామ్యం కొనసాగుతోందని, ప్రజలెవరూ మాట్లాడే సాహసం చేయడంలేదని, ఒకవేళ మాట్లాడితే తనను పెట్టినట్లే అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, జనం కళ్లు తెరవకముందే జగన్ ఇవన్నీ మానుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రఘురామ అన్నారు.
IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?