ప్రవీణ్ ప్రకాశ్ దానికి పనికిరాడు -ఇవిగో ఆధారాలు -ఏపీకి అనర్ధం -మళ్లీ ఎదురుదెబ్బ: ఎంపీ రఘురామ
సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తోన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి, ప్రభుత్వంలోని సీనియర్ అధికారులపై నేరుగా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో కీలకంగా వ్యవహరిస్తోన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ గత చరిత్రను ప్రస్తావిస్తూ, ఆయన వైఫల్యాలు ఇవీ అంటూ ఎంపీ రఘురామ కొన్ని విషయాలు బయటపెట్టారు. అదే సమయంలో కరోనా పరిస్థితి, స్కూళ్ల రీఓపెనింగ్ పైనా కామెంట్లు చేశారు. 'రాజధాని రచ్చబడ్డ' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
కడప జిల్లాకు వైఎస్సార్ పేరేంటి? - మద్యనిషేధం ఫెయిల్యూర్ -పిల్లలతో అఫిడవిట్లా?: ఎంపీ రఘురామ
సహజీవనానికి పిల్లల్ని పణంగానా?
‘‘నవంబర్ 2న స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. స్థానిక ఎన్నికలు వద్దంటున్నారు కాబట్టి చిన్న పిల్లలకు మినహాయింపు ఇచ్చి, ఫేజ్ ల వారీగా బడులు తెరుస్తున్నారు. దీనిపై నేను విద్యా మంత్రికి ఒక లేఖ రాశాను. గతంలో మా ప్రభుత్వం తీసుకున్న.. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయమైన ‘తప్పనసరి ఇంగ్లీష్'ను అమలు చేయొద్దని కోరాను. పాత విధానాలనే ఫాలో కావాలని లేఖలో సూచించాను. న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వకుంటే ధిక్కరణ ఉత్తర్వులొస్తాయి. తద్వారా మళ్లీ ఎదురుదెబ్బ తప్పదు. కరోనా ప్రభావం ఇంకా ఉందన్నప్పుడు.. సీఎం చెప్పిన ‘వైరస్ తో సహజీవనం' సిద్ధాంతం ప్రకారం స్కూలు పిల్లల్ని కూడా పణంగా పెడుతున్నామా? మరి అలాంటప్పడు..
నిమ్మగడ్డ చెబితే నో అన్నారుగా..
కరోనా గురించి ఎక్కువగా తెలియని రోజుల్లోనే ఎన్నికలు రద్దు చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మంచి నిర్ణయం తీసుకుంటే ఆయన్ని అన్యాయంగా తిట్టారు. ఇవాళ బీహార్ ఎన్నికలు సహా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు విజయవంతంగా సాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా అంటే ఏంటో ప్రజలకు పూర్తిగా తెలిసొచ్చింది కాబట్టి తగిన జాగ్రత్తలతో మనం ఎన్నికలకు ముందుకెళ్లాలి. ఎన్నికల రద్దు కరోనా వల్ల కాదు, క్యాస్ట్ వైరస్ వల్ల జరిగిందని, చంద్రబాబుకు నిమ్మగడ్డ వత్తాసు పలకుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గతంలో సెలవిచ్చారు. ఇప్పుడేమో.. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని, వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని ద్వంద్వ విధానంలో మాట్లాడారు. లిక్కర్ షాపులు, స్కూళ్లకు లేని కరోనా జాగ్రత్తలు ఎన్నికలకే ఎందుకు? ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి..
ప్రవీణ్ ఎన్నికలకు పనికిరాడు..
అసలు వైసీపీ సమస్య కరోనానా? డరోనానా? అర్థం కావట్లేదు. ఎన్నికలంటే భయపడి, ఆ భయానికి కరోనాను లింకు పెట్టి రోజుకో రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలకు రెడీ అయినా ఇక్కడో సమస్య ఉంది. ఆ సమస్య పేరే ప్రవీణ్ ప్రకాశ్. ప్రస్తుతం సీఎంవో, జీఏడీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన.. ఎన్నికల నిర్వహణకు అసలు పనికిరారని గతంలో(2005లో) అప్పటి ఎన్నికల కమిషనర్ స్వయంగా ప్రకటించారు. తన కెరీర్ అంతటా ఆయన ఇదే రకమైన ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రవీణ్ ప్రకాశ్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు ఒక బైఎలక్షన్ వచ్చిన సందర్భంలోనూ ఆయన దానికి పనికిరాడని దాన కిశోర్ ను కలెక్టర్ గా నియమించారు. ఆవేశపరుడు అని పేరుపొందిన ప్రవీణ్.. గతంలో విజయవాడ, గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పని చేసిన సమయంలో తోటి అధికారులను పబ్లిక్ గా దూషించినట్లు వార్తలు వచ్చాయి.
Recommended Video
అతని ఆవేశం ఏపీకి అనర్ధం..
ప్రవీణ్ ప్రకాశ్ ఒకప్పుడంటే జిల్లా కలెక్టర్. ఇప్పుడేమో సర్వాంతర్యామి. ముఖ్యమంత్రి కంటే పవర్ ఫుల్ వ్యక్తి అతనే అని అందరూ మాట్లాడుతున్నారు. ఇటీవల దసరా సెలవు విషయంలో చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వ్యవహరించడం, మిలాదున్ నబీ పండుగకు ఆయనకే సెలవు నిర్ణయం తీసుకోవడం తాజాగా చర్చనీయాంశం అయ్యాయి. స్థానిక ఎన్నికలపై ప్రజల అభిప్రాయం కోరారు కాబట్టి ఒక ఎంపీగా నా వెర్షన్ చెబుతున్నాను. గతంలో జరిగిన ఏకగ్రీవాలను పూర్తిగా రద్దు చేయాలి. నిజమైన ఏకగ్రీవాలుంటే మళ్లీ అవుతాయి. అదేసమయంలో తప్పులన్నీ తేలిపోతాయి. సంక్రాంతి లోపే ఎన్నికలు పెట్టాలి. ప్రవీణ్ ప్రకాశ్ చేత అన్ని పనులు చేయించుకోవాలనే ఆసక్తి సీఎం జగన్ కు ఉండొచ్చు. కానీ ఎన్నికల నిర్వహణలో ప్రవీణ్ ఫెయిల్యూర్ అన్న బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఆయన పాత్రపై జగనే నిర్ణయం తీసుకోవాలి. పాలకుడు ఆవేశపడటంలో అర్థముంది.. కానీ అధికారులకు ఆవేశం ఎక్కువైతే అనర్థం. ప్రవీణ్ ప్రకాశ్ విషయంలో మనం అదే చూస్తున్నాం'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
నిమ్మగడ్డతో ఢీ: జగన్కు భగపాటు - కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు - సుప్రీంకోర్టు చెప్పిందిదే: రఘురామ