నిమ్మగడ్డ రమేశ్ రూ.5కోట్లే - బుగ్గన ఎన్ని బుగ్గలు పట్టినా వేస్ట్ - పింక్ డైమండ్ కథేంటి?: రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారుకు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య మళ్లీ వివాదాలు పెద్దవైన నేపథ్యంలో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధుల తగ్గింపు, తిరుమలలో పింక్ డైమండ్ వివాదం సహా పలు అంశాలపై మాట్లాడారు. ఎంపీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
జగన్ చాటుకు వెళ్లి ప్రేమించాలి -హీరో మహేశ్బాబు ఫీలింగా? -పెయిడ్ గుట్టురట్టు: ఎంపీ రఘురామ
అలా చెబితే ఇలా రాశారు..
‘‘ఏపీ సర్కారు ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దని హైకోర్టు చెబితే.. దానిని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఆపాదించి జగన్ మీడియాలో కథనాలు రాశారు. ప్రజల డబ్బును ఎస్ఈసీ ఖర్చు పెడుతున్నారని, తన లాయర్లకు రూ.5 కోట్ల ఫీజులు చెల్లిస్తున్నారని కథనంలో రాసుకొచ్చారు. నిమ్మగడ్డ లాయర్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి మధ్యలో ఎస్ఈసీగా చేసిన కనగరాజ్ వ్యవహారాన్ని కూడా చూద్దాం. కనగరాజు లాయర్లలో ఒకరికి 58 లక్షలు, మరొకరికి 18 లక్షల ఫీజు పెండింగ్ లో ఉంది. కనగరాజు కేసులో కోర్టుల కోసం చేసిన ఖర్చులు భారీ గా ఉన్నాయి. ఇది కాకుండా.. ఏపీ ప్రభుత్వ న్యాయవాదులే తమకు రావాల్సిన 30 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోనూ పేరుమోసిన లాయర్లకు భారీగా ఫీజులు ఇస్తున్నారు.
నాకిస్తే పని చేస్తా..
ఉత్తరాంధ్రలో ఎస్టీల జాబితాలో ఉన్న బోయ కులస్తులు.. రాయలసీమలో మాత్రం ఆ రిజర్వేషన్ పొందలేకపోతున్నారు. బోయ వర్గం ముమ్మాటికీ షెడ్యూల్ ట్రైబ్స్ కిందికి వస్తారు. రాయలసీమలో బోయ కులస్తులు లక్షల్లో ఉన్నారు. వాళ్లకు ఎస్టీ హోదా ఫైలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందట. ఇప్పటికీ నేను వైసీపీ ఎంపీనే కాబట్టి.. బోయలను ఎస్టీల్లో చేర్చే పనిని నాకైనా అప్పగించండి. చేసిచూపిస్తాను.
నిధుల కోత తెలిసే జరిగిందా..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం గతంలో రూ.50వేల కోట్లు ఇస్తామన్నారు. కానీ కాల క్రమంలో ఖర్చు బాగా పెరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు 20వేల కోట్లే ఇస్తామంటోంది. ఇక్కడ మనకొక క్లారిటీ రావాలి.. కేంద్రం ఏది చేసినా వైసీపీకి చెప్పే చేస్తుందని, జగన్ పట్ల కేంద్రానికి ఉన్న అత్యంత గౌరవం ఉందని, కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ వెళుతుందని, వైసీపీ ఏది చేసినా కేంద్రానికి తెలిసే చేస్తుందని ప్రకటనలు చేసినవాళ్లు ఇప్పుడు పోలవరం నిధులపై మాట్లాడాలి. పొద్దునలేస్తే ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్రంలోని పెద్దలందరితో మా పార్టీ నేత విజయసాయిరెడ్డి నిత్యం టచ్ లో ఉంటారని చెబుతున్నారు. అలాంటప్పుడు పోలవరానికి నిధుల తగ్గింపు కూడా వైసీపీకి తెలిసే జరిగిందా?
బుగ్గన ఎన్ని బుగ్గలు పట్టినా..
సీఎంగారు నేరుగా ఢిల్లీకి వచ్చి పోలవరంపై మాట్లాడాలి. మూడు పదుల రాష్ట్రాల్లో ఒకదానికి జగన్ సీఎం. అంతేగానీ ఆయనేమీ ట్రంప్ స్థాయి మనిషి కాదుగా. మంత్రి బుగ్గన వచ్చ ఎవరివో బుగ్గలు పట్టుకుంటేనో, విజయసాయి లేఖలిస్తేనో ఏమీ ఒరగదు. సీఎం వాల్యుబుల్ పర్సన్ కాబట్టి జగనే వచ్చి మాట్లాడాలి. ఏపీకి నిధులను కూడా అమిత్ షానే అడిగితే ఎలా? పోలవరం నిర్మించకపోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ముఖం ఉండదు. పోలవరం నిధులపై నాలాంటివాళ్ల సలహాలు తీసుకోరు, ఢిల్లీలో ఎవరినైనా కలవాలంటే.. రెడ్డి పాలెగాళ్ల పర్మిషన్ తీసుకోవాల్సిందే అని నిబంధన పెట్టారు. నా వ్యక్తిగత పరిచయాలమేరకు చాలా చేయగలను. కానీ పాలెగాళ్ల అనుమతి పొందడం మాత్రం నాకు ఇష్టంలేదు. సీఎం ఇప్పటికైనా పోలవరంపై దృష్టిపెట్టకపోతే వైసీపీకి శాపంగా మారుతుంది.
Recommended Video
పింక్ డైమండ్ కథేంటి?
మూడు రోజులుగా రాష్ట్రమంతా పింక్ డైమండ్ గురించి చర్చిస్తోంది. అది దేవుడితో ముడిపడిన అంశం కాబట్టి కచ్చితంగా మాట్లాడాల్సిందే. గతంలో టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, వైసీపీ ప్రధాన అర్చకులు విజయసాయిరెడ్డిలు కూడా పింక్ డైమడ్ పై మాట్లాడారు. టీటీడీ అనేది స్వతంత్ర సంస్థ. గతంలో దానిపై అవాకులు చెవాకులు మాట్లాడినందుకు ఒకరిద్దరిపై 200 కోట్ల పరువునష్టం దావా పడితే, ప్రభుత్వ సొమ్ము, భక్తులిచ్చిన కానుకలు రూ.2 కోట్లను కోర్టు ఫీజులు కట్టారు. ఇప్పుడా రెండు కోట్లు వెనక్కి వస్తాయా అని ఆలోచన చేస్తున్నారట. మరి అలాంటప్పుడు అభియోగాల సంగతేంటి? ఎన్నికల్లో లబ్ది కోసమే దేవుణ్ని అడ్డం పెట్టుకున్నారా? అనే అప్రతిష్ట వస్తుంది. రికార్డుల్లో లేని పింక్ డైమండ్ గురించి గతంలో ఎందుకు రచ్చ జరిగింది? అసలు దాని కథేంటి? ఇందులో వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది? అనే విషయాలను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి''అని ఎంపీ రఘురామ అన్నారు.
భయంతో 144 రోజులు ఇల్లు కదలని సీఎం నితీశ్ - వలసదారుల్ని గాలికొదిలేశారు- తేజస్వీ నిప్పులు