విశాఖలో భారీగా ఉద్యోగాలు పెరిగాయి - జక్కన్న చెక్కాడు - వాళ్లను జగన్ ఈడ్చికొట్టాలి: ఎంపీ రఘురామ
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిలో రాజధానికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రతిపాదిత కొత్త కార్యనిర్వహక రాజధాని విశాఖపట్నంలో వాస్తవ పరిస్థితులు ఇవంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖ సహా ఏపీలో చోటుచేసుకుంటోన్న కీలక పరిణామాలపై స్పందించారు. ఎంపీ ఏమన్నారంటే..
జగన్ తప్పు దిద్దుకున్నారు- జస్టిస్ రమణ అంశంలో చెంపపెట్టులా ఆమె - మోదీదే బాధ్యత: ఎంపీ రఘురామ
ఉద్యోగాలు, ఉపాధి పెరిగాయి..
‘‘18 నెలలుగా అమరావతిలో పనులు నిలిచిపోవడంతో కొత్త రాజధానిగా మావాళ్లు భావిస్తోన్న విశాఖపట్నంలో యాక్టివిటీలు పెరిగాయి. ఇటీవల కాలంలో విశాఖలో ఉద్యోగాలు బాగా పెరిగాయి. అదే సమయంలో నిర్మాణరంగం కూడా ఊపందుకుంది. ఎవరికైతే ఖాళీ స్థలం ఉందో.. వాళ్లు గోడలు కట్టేసుకుంటున్నారు. ఇసుక ఇబ్బందులు ఉన్నా నిర్మాణాలు ఆగడంలేదు. తమ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారేమో అనే భయంతో జనం నిర్మాణాల వేగాన్ని పెంచారు. ఇక ఉద్యోగాల విషయానికొస్తే.. ఎక్కువ స్థలం ఉన్నవాళ్లందరూ అది కబ్జాకు గురికాకుండా కాపలాగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటున్నారు. అలా ఉద్యోగాలు పెరిగాయి. దీన్ని మనం పాజిటివ్ గానే చూడాలి. ఇదంతా..
ఈశాన్యంలో నదిని వదిలేసి..
సీఎం జగన్ కు అతి దగ్గరగా ఉండే ఓ వ్యక్తి ప్రస్తుతం విశాఖకు పాలెగాడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన పాలన సరిగా లేదు కాబట్టే జనం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అద్భుతమైన వాస్తుతో, ఈశాన్యంలో నది కూడా ఉన్న అమరావతిని వదిలేసి, రాజధానిని విశాఖకు మార్చాలని ఏ శక్తి ప్రేరేపించిందో సీఎం ఆలోచించుకోవాలి. నిజంగా జగన్ ఫోకస్ చేస్తే ఏపనైనా చేయగలరని జనం నమ్ముతున్నారు. ఎటొచ్చీ తప్పుడు సలహాదారుల వల్లే ఆయన ప్రతిష్ట దెబ్బతింటోంది. తాజాగా తెరపైకి వచ్చిన సర్వేరాళ్ల సంగతి కూడా అలాంటిదే..
జక్కన్న చెక్కాడు.. జగనన్న చెక్కిస్తున్నాడు..
రాష్ట్రమంతటా సర్వేరాళ్లు పాతుతూ, వాటిపై జగన్ బొమ్మను చెక్కుతున్నారు. ‘శిలలపై జగనన్న' పేరుతో దీనిపై వార్తలు కూడా వస్తున్నాయి. ఇంత చీప్ పబ్లిసిటీ పిచ్చి, సైకిక్ ఫ్యాంటసీ జగన్ కు ముమ్మాటికీ లేదు. అసలు సర్వేకు, సీఎం బొమ్మకు సంబంధమేంటి? గతంలో ఎప్పుడో కర్ణాటకలో జక్కన అనే శిల్పి ఉండేవాడు. ఆయన ఎన్నెన్నో అద్భుతమైన శిల్పాలు చెక్కారు. ఇప్పుడు జనం.. ‘‘జక్కన్న చెక్కాడు.. జగనన్న చెక్కించుకుంటున్నాడు'' అని అనుకుంటున్నారు. సర్వేరాళ్లపై బొమ్మల శాంపిళ్లతో ఎవరైనా వస్తే లాగి ఒక్కటి పీకాలని సీఎంను కోరుతున్నాను. కేవలం సీఎంను అన్ పాపులర్ చేయడానికే చుట్టూఉన్న వాళ్లు ఇలాంటి దరిద్రపు ఐడియాలు ఇస్తున్నారు.
నిమ్మగడ్డ, కరోనాపై తప్పుడు లెక్కలు
కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేశారన్న కోపంతో నిమ్మగడ్డ రమేశ్ తిరిగి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా జగన్ ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదు. అదొక రాజ్యాంగ వ్యవస్థ అని కూడా చూడకుండా వ్యవహరిస్తే.. నిమ్మగడ్డ ఆఫీసు ఖర్చుల కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో సీఎం అడ్వైజర్లది తప్పే అవుతుంది. ఇక ఏపీలో కరోనా లెక్కల్లోనూ తప్పులున్నట్లు తెలుస్తోంది. దేశంలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీకి చెందినవి ఐదు ఉండటం, అందులోనూ మా ఉభయగోదావరి జిల్లాలు ఉండటం దారుణం. స్థానికంగా కరోనా కేర్ సెంటర్లను మూసేస్తున్నారని జిల్లాల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ప్రభుత్వం చూపించే లెక్కల కంటే కరోనా కేసులు ఎక్కువే ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ సీఎంకు తెలియనీయడంలేదు. గోదావరి జిల్లాల్లో కరోనాపై ఆయన ప్రత్యేక దృష్టిపెట్టాలి.
Recommended Video
జగన్ ఆత్మావలోకనం చేసుకోవాలి..
ఇటీవల మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ .. ఒక మహిళా నేతను ‘ఐటమ్' అని సంబోధిస్తే.. దాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో రాహుల్ తీరును మెచ్చుకోవాలి. అదే మన ఏపీలో మాత్రం మంత్రులే ఎల్ భాష మాట్లాడుతుంటే సీఎం పట్టించుకోకపోవడం శోచనీయం. రాహుల్ మాదిరి బయటికి చెప్పకున్నా.. కనీసం అంతర్గతంగానైనా బూతులు లేకుండా మాట్లాడమని మంత్రులకు చెప్పాలి. సీఎం కావడానికి ముందు ప్రజలతో మమేకమైన జగన్.. ఇవాళ బయటికి రాకపోవడం, ప్రజల సమస్యల్ని నేరుగా వినకపోవడం వల్ల అంతా అస్తవ్యస్థంగా మారింది. జగన్ ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇసుక విషయంలో మారినట్లే అన్నింట్లో సీఎం మారాలి. తద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది'' అని ఎంపీ రఘురామ అన్నారు.
జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామ