జగన్కు పార్టీపై పట్టు తప్పుతోందా?: వైసీపీలో కాంగ్రెస్ తరహా ప్రజాస్వామ్యం: అసమ్మతి గళం
అమరావతి: రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశాన్ని మట్టి కరిపించి అధికారంలోకి వచ్చింది పదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీని స్థాపించిన పదేళ్ల కాలంలో దాన్ని అధికారంలోకి తీసుకుని రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఢక్కా మొక్కీలను చవి చూశారు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచారు. రాజకీయ అణచివేతను అధిగమించారు. ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను తుత్తునీయలు చేశారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకు పరిమితం చేశారు. 151 స్థానాలతో అఖండ విజయాన్ని సాధించారు.
విశాఖ గ్యాస్ లీక్: తగ్గని ప్రకంపనలు: ఎల్జీ పాలిమర్స్కు భారీగా వడ్డింపు: తవ్వే కొద్దీ
ఏడాదిలోనే అసంతృప్తుల గళం
వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన పదేళ్లలోపే అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. దాన్ని సుదీర్ఘకాలం నిలబెట్టుకోవడం ఒక ఎత్తులా కనిపిస్తోంది. పార్టీ అధికారాన్ని అధిరోహించిన సరిగ్గా ఏడాదికాలంలోనే అసంతృప్తుల గళం వినిపిస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ.. అసంతృప్తుల మూలాలు ఏవైనప్పటికీ.. దాని ప్రభావం పార్టీపై పడుతోందనడంలో తడుముకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
పాలనపైనే దృష్టి..
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన దృష్టి మొత్తాన్నీ పాలనపైనే కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన సర్వశక్తులను ఒడ్డుతున్నారు. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ సమయంలోనూ సంక్షేమానికి లోటు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ ఒక్కటొక్కటికిగా నెరవేర్చుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్నారు.
పార్టీపై పట్టు తప్పుతోందా?
పాలనపై దృష్టి సారించిన నేపథ్యంలో వైఎస్ జగన్కు పార్టీపై పట్టు తప్పుతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న వైసీపీకి చెందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకాల విషయంలో ఆయన బహిరంగంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాంటి చర్యలను మానుకోవాలని సూచించారు. వైసీపీ నాయకులు దాదాపుగా బహిష్కించినట్లుగా భావిస్తోన్న మీడియా సంస్థలకు ఆయన ఈ సందర్భంగా ఇంటర్వ్యూలను ఇచ్చారు. ప్రభుత్వ లోపాన్ని ఎత్తి చూపారు.
నిమ్మగడ్డ తొలగింపులోనూ..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను తప్పించడాన్ని కూడా రఘురామ కృష్ణంరాజు తప్పు పట్టారు. దీనికోసం ఆర్డినెన్స్ తీసుకుని రావడం సరికాదని చెప్పుకొచ్చారు. మనకు ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలనుకున్నప్పుడు దానికి అనుగుణంగా సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఏకంగా వైఎస్ జగన్నే పరోక్షంగా టార్గెట్ చేశారాయన. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ జాబితాలో చేరారు. ప్రభుత్వంపై విమర్శలను సంధిస్తున్నారు.
Recommended Video
తన నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదంటూ..
తన సొంత నియోజకవర్గం వెంకటగిరిని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రామనారాయణ రెడ్డి విమర్శిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో తన నియోజకవర్గాన్ని పాలకులు విస్మరించారని, ఇలాగైతే పోరాటం తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. వెంకటగిరి అనే నియోజకవర్గం ఒకటి ఉందనే విషయాన్నే విస్మరించినట్లుగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదనీ అన్నారు. ఏడాది కాలంలోనే ఇలాంటి అసమ్మతుల గళాన్ని వినాల్సి వచ్చిందంటే పార్టీ నిర్మాణంలో ఎక్కడో లోపం ఉందనేది స్పష్టమౌతోందనే అంటున్నారు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.