రఘురామకు బుల్లెట్ ప్రూఫ్ కారు: వై లేదా వై ప్లస్ సెక్యూరిటీ? ఇక బీజేపీకి అనుబంధ సభ్యుడిగా?
న్యూఢిల్లీ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామ కృష్ణంరాజు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. ఆయనకు భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. వై లేదా వై ప్లస్ భద్రతను కల్పించవచ్చని సమాచారం. రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా.. నేరుగా కేంద్ర బలగాల నుంచి రక్షణ కల్పించేలా సన్నాహాలు సాగుతున్నాయని అంటున్నారు.
పుట్ట బద్దలు: అత్యంత ప్రమాదకర తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్: ఏపీ వాటా ఎక్కువే: ఆందోళనగా
ప్రాణభయం ఉందంటూ..
సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరుల నుంచి తనకు ప్రాణభయం ఉందంటూ రఘురామ కృష్ణంరాజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగలేదాయన. దేశ రాజధానిలో మకాం వేశారు. వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తన రాజకీయ బాటలను సైతం మార్చుకునేలా వ్యవహరింంచారు. స్పీకర్తో పాటు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డిలతో భేటీ అయ్యారు. తనకు రక్షణ కల్పించాలని విజ్ఙప్తి చేశారు.
హోం శాఖ కార్యదర్శితో భేటీలో హామీ..
రాజ్నాథ్ సింగ్, జీ కిషన్ రెడ్డిల సూచలన మేరకు రఘురామ హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో భేటీ అయ్యారు. తన స్థితిగతులను వివరించారు. ఈ భేటీ సందర్భంగానే ఆయనకు కేంద్ర బలగాల నుంచి రక్షణ కల్పిస్తామనే హామీ లభించినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా.. రఘురామకు వై లేదా వై ప్లస్ బలగాలతో భద్రత కల్పించవచ్చని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని చెబుతున్నారు.
వై ప్లస్ సెక్యూరిటీ ఇస్తే..
వై ప్లస్ సెక్యూరిటీ గనక లభిస్తే.. రఘురామ వ్యక్తిగత భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి. ఇంటికి కూడా సాయుధ బలగాలతో రక్షణ ఏర్పడుతుంది. ఇద్దరు వ్యక్తిగత భద్రత అధికారులు మూడు షిఫ్టుల్లో ఆయనకు అందుబాటులో ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయిస్తారు. దీనితోపాటు 11 మంది భద్రతా సిబ్బంది ఆయనకు ఎల్లవేళలా రక్షణగా ఉంటారు. ఈ దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ వారంరోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైసీపీకి ఝలక్
ఓ అధికార పార్టీ లోక్సభ సభ్యుడికి.. సొంత పార్టీ నుంచి ప్రాణభయం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పించాల్సిన పరిస్థితి వస్తే.. వైసీపీకి అది అవమానకరంగానే భావించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వ్యక్తిగతంగా కేంద్రం వద్ద తనకు ఉన్న బలాన్ని, పలుకుబడిని ఆయన పరోక్షంగా ప్రదర్శించుకున్నట్టవుతుందని అంటున్నారు. ఇకపై ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని పార్టీపరంగా తీసుకున్నా.. తాము ఆయనకు అండగా ఉన్నామనే సంకేతాన్ని కేంద్రం పంపించినట్టువుతుందని చెబుతున్నారు.
బీజేపీకి అనుబంధంగా..
కేంద్రం తనకు రక్షణ కల్పించడమంటూ జరిగితే.. రఘురామ కృష్ణంరాజుకు ఇక వైసీపీకి దూరమైనట్టే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. లోక్సభలో బీజేపీకి అనుబంధ సభ్యుడిగా ఆయన కొనసాగుతారని చెబుతున్నారు. భవిష్యత్తుల్లో ఏదైనా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. వైసీపీ మాటను ఆయన పట్టించుకోకపోవచ్చని, ఎన్డీఏ కూటమికి అనుగుణంగా, సొంతంగా నిర్ణయానుసారం రఘురామ వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.