రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన వేళ..నిర్మలా సీతారామన్కు వైసీపీ ఎంపీ ఓపెన్ లెటర్
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను కొనసాగించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన వివిధ రంగాలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని ఏఏ రంగాలకు కేటాయించామనే విషయాన్ని వివరించడానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా వరుసగా అయిదుసార్లు విలేకరుల ముందుకు రావాల్సి వచ్చింది.
మళ్లీ మొదటికొచ్చినట్టే: ఏపీలో హాఫ్ సెంచరీ దాటిన కరోనా కేసులు: కొంత గ్యాప్ తరువాత..
ఈ ప్యాకేజీ మీద సర్దుబాట్లన్ని ముగిసిన మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కొన్ని విజ్ఙప్తులను కేంద్రం ముందు ఉంచారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుండి పోరాడుతోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల మేర జీవిత బీమాను కల్పించిందని, అదే తరహా సౌకర్యాన్ని బ్యాంకు ఉద్యోగులకు కూడా కల్పించాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
బ్యాంకు ఉద్యోగులను కూడా కరోనా వైరస్ ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా పబ్లిక్, ప్రైవేటు బ్యాంకింగ్ రంగాల్లో 13 లక్షలమంది ఉద్యోగులు పని చేస్తున్నారని, కరోనా సంక్షోభ సమయంలోనూ వారు విధులకు హాజరవుతున్నారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తోన్న సంక్షేమ పథకాలు బ్యాంకు ఉద్యోగుల ద్వారానే లబ్దిదారులకు అందుతున్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద జన్ధన్ ఖాతాలకు 500 రూపాయల మొత్తాన్ని నేరుగా బదలాయించిందని, ఆ మొత్తాన్ని లబ్దిదారుడికి అందజేయడానికి బ్యాంకు ఉద్యోగులు కరోనా వైరస్ను కూడా లెక్క చేయకుండా విధులకు హాజరవుతున్నారని అన్నారు. హైదరాబాద్లోని పురానాపూల్లో ఓ బ్యాంకు ఉద్యోగికి కరోనా వైరస్ సోకి క్వారంటైన్కు వెళ్లారని అన్నారు. ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొంటోన్న బ్యాంకు ఉద్యోగులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు.
ప్రభుత్వరంగంలో ఉన్న కొన్ని బ్యాంకులు ఉద్యోగులకు బీమా సౌకర్యాన్ని కల్పించినప్పటికీ.. అది కోవిడ్-19 కింద కవర్ కావట్లేదని చెప్పారు. ఈ ఇబ్బందిని అధిగమించి, బ్యాంకు ఉద్యోగులకు భరోసా కల్పించడానికి 50 లక్షల రూపాయల కోవిడ్-19 బీమా కవరేజీని వర్తింపజేయాలని అన్నారు.