భక్తిని చాటుకుంటోన్న రఘురామ: వైఎస్ జగన్కు మరో లేఖ: ఆగస్టు 5తో లింకు: లెటర్ స్పెషాలిటీ అదే
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నేతగా గుర్తింపు పొందిన నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తన దూకుడును కొనసాగిస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇప్పటికే పలుమార్లు లేఖాస్త్రాలను సంధించారు. తాజాగా మరోసారి లేఖను రాశారు. గతంలో రాసిన వాటితో పోల్చుకుంటే.. ఈ సారి రాసిన లేఖకు స్పెషాలిటీ ఉంది. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం కంట్లో పడేలా ఆయన ఈ లేఖను రాసినట్లు చెబుతున్నారు.
అన్లాక్ 3 వేళ.. మైండ్ బ్లాక్ చేస్తోన్న కరోనా ఫిగర్స్: ఏపీ వాటా ఎఫెక్ట్?: సడలింపులతో మరింత
ఆగస్టు 5వ తేదీతో లింకు..
ఆగస్టు 5వ తేదీతో లింకు పెట్టి మరీ.. రఘురామ కృష్ణంరాజు ఈ లేఖను రాశారు. ఆగస్టు 5వ తేదీన ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ చేయనున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సంఘ్ పరివార్ నాయకులు దీనికి హాజరు కానున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రఘురామ వైఎస్ జగన్కు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చరిత్రలో నిలిచిపోయే సందర్భం..
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజను చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలను నిర్వహించేలా చర్యలను తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రికి విజ్ఙప్తి చేశారు. రామమందిరం నిర్మాణానికి భూమిపూజ చేసే సందర్భం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. చారిత్రక, సాంస్కృతికంగా దేశంలో సువర్ణాధ్యాయానికి తెర తీసే సంఘటనగా అభివర్ణించారు. రామమందిరం నిర్మాణం కోసం చరిత్రలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు.
అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
అలాంటి చారిత్రక ఘట్టాన్ని చేజార్చుకోవద్దని రఘురామ సూచించారు. రాష్ట్రంలో మొత్తం 24 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయని, వాటన్నింట్లో ఆగస్టు 5వ తేదీ నాడు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించేలా, వేద పారాయణాలు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ దిశగా దేవాదాయ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. వేద పారాయణాలు, మంత్రోచ్ఛారణలు, హోమాల వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు.
ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం..
భూమిపూజ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రఘురామ కోరారు. రాష్ట్రంలో రామాలయం లేని గ్రామం ఏ ఒక్కటీ ఉండదని గుర్తు చేశారు. కోట్లాదిమంది హిందువులు శ్రీరామచంద్రుడిని ఆరాధ్యదైవంగా పూజిస్తారని, స్వామి వివేకానందుడు కూడా శ్రీరాముడి సిద్ధాంతాలను అనుసరించేలా యువతకు పిలుపునిచ్చారని అన్నారు.
భూమిపూజకు హాజరవ్వండి..
భూమిపూజ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన వైఎస్ జగన్కు విజ్ఙప్తి చేశారు. ఈ మహోత్సవంలో పాల్గొనాలంటూ శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపిన విషయం మీడియా ద్వారా తనకు తెలిసిందని అన్నారు. అదే నిజమైతే.. ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. ఓ చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యులుగా చరిత్రలో నిలిచిపోతారని ఆయన వైఎస్ జగన్కు సూచించారు.
Recommended Video