జగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. జగన్ సర్కారుపై మరోసారి రాజకీయ విమర్శలు గుప్పుమన్నాయి. ఈసారి విమర్శలు చేసినవాళ్లలో వైసీపీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఉన్నారు. నిమ్మగడ్డ వ్యవహారంతోపాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై.. టీడీపీ, బీజేపీ నేతలకంటే ఘాటుగా జగన్ సర్కారుపై రఘురామ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన చెప్పిన మాటలివి..
జగన్ సర్కారుకు భారీ షాక్.. నిమ్మగడ్డ కేసులో సుప్రీం తీవ్ర స్పందన.. 'ధిక్కరణ'పై స్టే కు నిరాకరణ..
జగన్ తీరును పెద్ద జోక్..
‘‘రాజ్యాంగ వ్యవస్థలతో జగన్ సర్కారు అనుసరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా పెద్ద జోక్ లా మారింది. నేను వ్యక్తిగతంగా చాలా మంది అడ్వొకేట్లు, ప్రజాప్రతినిధులతో మాట్లాడాను. మా ప్రభుత్వంలోనూ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతున్నారు. ఎందుకంటే వారి నియోజకవర్గాల్లోనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అభిమానులు కూడా నవ్వుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే న్యాయవ్యవస్థను ఇంతలా కించపరిస్తే ప్రభుత్వంలో బాధ్యత గల పదవుల్లో ఉన్న పెద్దలు.. న్యాయవ్యస్థను ఇంకా తిట్టండి.. సోషల్ మీడియాలోనూ తిట్టండి మేమే చూసుకుంటాం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇది అందరం తలదించుకోవాల్సిన పరిస్థితి.
నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..
ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహారంలోనూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది కనుక.. మళ్లీ వేరే అభిప్రాయాలు తీసుకోకుండా.. మళ్లీ ఆయనను ఆఫీసులో కూర్చోనేలాగా దారి కల్పించాలి. రమేశ్ కుమార్ తన కార్యాలయానికి వెళ్లకుండా పోలీసుల్ని అడ్డుపెట్టినట్లు తెలుస్తోంది. వాళ్లను వెంటనే వెనక్కి రప్పించడండి. ఆయనకు కేంద్ర బలగాలు ఉన్నాయి. నాకూ రేపో మాపో కేంద్ర బలగాలు వస్తాయి. అదీకాకుండా, ఎన్నికల్ని వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ఎంత సరైందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. సరే, అప్పుడు మన పార్టీ ఆయను అపార్థం చేసుకున్నా సరే, ఇప్పటికైనా అన్ని మర్చిపోయి ముందుకు వెళదాం..
సీఎం ఆ చెత్తను వదిలించుకోవాలి..
నిజానికి నిమ్మగడ్డ ఇష్యూలో గవర్నర్ నిర్ణయం తర్వాతే మా పార్టీకి దారులన్నీ మూసుకుపోయాయి. దయచేసి సుప్రీం నిర్ణయానికి వ్యతిరేకంగా మనం వెళ్లొద్దు. సీఎంగారి చుట్టూ తెలివైన వ్యక్తులు చాలా మంది చేరారు. వాళ్లంతా కలిసి సీఎం ఆలోచనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. అలాంటి దుష్టశక్తుల్ని, చెత్తను వదిలించుకోవాలని నా సీఎంను వేడుకుంటున్నాను. ఆరోజు నిమ్మగడ్డపై మనం తొందరపడ్డాం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక కులం గురించి మాట్లాడం చాలా తప్పు. సరే, జరిగింది వదిలేద్దాం. తప్పులు తెలుసుకున్నవాడే నిజమైన మనిషి. ఇకనైనా రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థల్ని గౌరవించుకుంటూ ముందుకు పోదాం.
జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్
బాటా లెక్కల్లా కరోనా కేసులు..
ఇవాళ ఏపీలో కరోనా లెక్కలు చూస్తే బాటా చెప్పుల షాపులో రేట్లు గుర్తుకొస్తున్నాయి. ఒక్క రోజులో 7998 కేసులు అంటున్నారు. 8 వేలు అంటే ఏం పోయిందోనాకు తెలీదు. బాటా లెక్కలైనా సరే, సంఖ్య వేలల్లోనే ఉంది. రాబోయే రోజుల్లో రోజుకు 10వేల కేసులు వచ్చేలా ఉన్నాయి. ఇదే కరోనా విషయంలోనే నిమ్మగడ్డ రమేశ్ సమయానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కీలక పదవుల్లో ఉన్న వాళ్లు తీసుకునే నిర్ణయాలు, చేసే వ్యాఖ్యల్ని వెంటనే విభేదించకుండా వెయిట్ చేస్తే దాని అర్థమేంటో తెలుస్తుంది. కరోనా ముప్పు ఉంది కాబట్టి ఎన్నికలు వద్దని నిమ్మగడ్డ అన్నా, కరోనాతో సహజీనం చేయాలని సీఎం జగన్ అన్నా దేన్నీ మనం తేలికగా తీసుకోవద్దు. అయితే..
జనం సహజీవనం చేస్తున్నారు..
కరోనాతో సహజీవనం చేద్దామని సీఎం జగన్ పిలుపునిచ్చారు.. అలా చేయడానికి ప్రపంచంలో ఉన్న బెడ్లు సరిపోవు. అయినాసరే, ఆయన మాటమీద నమ్మకంతో సహజీవనానికి సిద్ధపడ్డ ప్రజలు.. ఇవాళ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొవిడ్ వ్యాధి పారాసిటమాటల్ తో తగ్గేది కాదు. రోజుకు ఆరు డోసుల మందుకు కనీసం రూ.30 వేలు ఖర్చవుతుంది. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడం మంచిదే అయినా, ఆ మందులు మాత్రం ప్రజలకు అందుబాటులో లేవు. కరోనా సోకిన కీలక నేతలేమో పక్కా రాష్ట్రాలకు పోయి చికిత్స చేయించుకుంటున్నారు.
సాయిరెడ్డిది గురివిందనీతి..
అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు సరిపోవా అని అదోరకంగా మాట్లాడారు మా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిగారు. ఇవాళ ఆయనేమో కరోనా వస్తే వెళ్లి హైదరాబాద్ లోని కార్పోరేట్ ఆస్పత్రిలో చేరారు. దీన్ని గురివిందనీతి కాక ఏమంటారు? నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన కామెంట్లు పెట్టొచ్చని రెచ్చగొట్టంది కూడా ఆయనే. మను సీఐడీ ఉంది, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం అని పదే పదే చెప్పడం వల్లే న్యాయవ్యవస్థలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది. అంతిమంగా ఈ విధానాలన్నీ పార్టీకి తీరని నష్టం చేస్తాయి.
Recommended Video
ప్రమాదంలో వైసీపీ గుర్తింపు..
నిమ్మగడ్డ, కరోనా అంశాల్లోనేకాదు, నాపైనా మా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధంగానే ఉంది. ఒక పార్టీ తరఫున ఎంపీగా గెలిచినంత మాత్రాన పౌరుడిగా నాకుండే హక్కుల్ని నేను కోల్పోను. ప్రజాస్వామ్యంలో అసమ్మతిని ఫండమెంటల్ రైట్ గానే భావించాలని సుప్రీంకోర్టు నిన్ననే(రాజస్థాన్ కేసులో) స్పష్టం చేసింది. దయచేసి మనం రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. నేను పార్టీ విధేయుణ్ని కాబట్టి కామ్ గా ఉంటున్నాను. కానీ రాజ్యాంగ స్ఫూర్తి గురించి తెలిసినవాళ్లెవరైనా సరే వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని పిటిషన్లు వేస్తారు. అప్పుడు మనం మరింత ప్రమాదంలో పడినట్లవుతుంది. కాబట్టి, ఒక పొలిటికల్ పార్టీగా, ప్రభుత్వంగా మనం రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోరాదని ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నా'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు వివరించారు.