బీజేపీ కార్యాలయంలో వైపీపీ ఎంపీ: సీఎం జగన్ హెచ్చరించినా: ప్రధాని, షా తో భేటీ అవుతా..!
కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీ లో కార్యాలయంలో దర్శనమిచ్చారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసి..పార్లమెంట్ లో..ఢిల్లీలో జరిగిన పరిణామాల గురించి వివరించి..తన మీద వస్తున్న విమర్శలకు ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీతో టచ్ లో ఉన్నారనే వార్తలకు సమాధానం చెప్పారు. ఇంగ్లీషు మీడియం పాఠశాలల విషయంలో ఆయన ప్రసంగం పైనా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా బీజేపీ నేతలతో సన్నిహతంగా ఉండటం పైనా ..ఆయన మీద అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది. ఇక, ఈ ఎపిసోడ్ ముగిసిందనుకుంటున్న సమయంలో మరో సారి రఘురామకృష్ణంరాజు కొత్త చర్చకు కారణమయ్యారు.
రఘురామకృష్ణంరాజు అక్కడ ప్రత్యక్షం..
కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహానికి గురయ్యారంటూ వార్తల్లో నిలిచిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ ప్రాంగణంలోని బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. లోక్ సభలో మహారాష్ట్ర రాజకీయాల మీద ప్రతిపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడింది. ఆ సమయంలో రఘురామకృష్ణంరాజు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. అక్కడే దాదాపు అరగంట సేపు కూర్చుకున్నారు. దీంతో..ఇది మరో సారి చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లీషు మీడియం పాఠశాలల మీద ఎంపీ వ్యతిరేక భావం వచ్చేలా వ్యాఖ్యలు చేసారని..దీని పైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారనే వార్తలతో ఆయన నేరుగా సీఎం జగన్ కు వివరణ ఇచ్చారు. దీంతో..ఆ ఎపిసోడ్ ముగిసింది. తిరిగి ఇప్పుడు బీజేపీ కార్యాలయంలో కనిపించటం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ..
కొందరు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు ముక్తకంఠంతో ఖండించారు. ముఖ్యమంత్రిని కలిసిన తరువాత రఘురామకృష్ణంరాజు సైతం సుజనా చౌదరి వ్యాఖ్యలను తప్పు బట్టారు. పార్లమెంట్ సభ్యులుగా తమకు వ్యక్తిగత పరిచయాలు ఉంటాయని..అంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదని స్పష్టం చేసారు. అదే సమయంలో జగన్ ను వీడి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇక, ప్రధాని మోదీతో ఎప్పటి నుండో పరిచయం ఉందని..అందులో భాగంగానే తనను మోదీ పలకరించారని..తాను సైతం మర్యాదపూర్వకంగా స్పందించానని చెప్పుకొచ్చారు. అంత మాత్రాన తాను పార్టీ మారుతున్నట్లేనా అని ప్రశ్నించారు. సీఎం సైతం రఘురామకృష్ణంరాజు వివరణతో ఆ చర్చను ముగించారు.
కావాలంటే..ప్రధాని ..షాతోనే భేటీ అవుతా
తాను రాజకీయంగా చర్చలు చేయాలంటే పార్లమెంట్ ప్రాంగణంలోని పార్టీ కార్యాలయంలో ఏముంటుంది మాట్లాడటానికి అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తనకు ఎటువంటి మొహమాటం లేదని.. చెప్పుకొచ్చారు. కావాలనుకుంటే ప్రధాని మోదీ..అమిత్ షా..ఇలా పెద్ద నాయకులతో నేరుగా మాట్లాడగలనని స్పష్టం చేసారు. ప్రధాని మోదీని అప్పాయింట్ అడగగలనన్నారు. ఈ రోజు కాకుంటే వారం తరువాత అయినా తనకు అప్పాయింట్ మెంట్ ఇస్తారని చెప్పుకొచ్చారు. తాను తనకు ఇంటి కేటాయింపు కోసమే పార్టీ కార్యాలయంలో అక్కడకు వస్తానని చెప్పిన నేతను కలిసేందుకే వెళ్లానని స్పష్టం చేసారు. ప్రతీ అంశాన్ని రాద్దాంతం చేయటం తగదన్నారు.
అధికారిక నివాసం కోసమే..
తాను బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లటానికి కారణాలను రఘురామకృష్ణంరాజు వివరించారు. ఢిల్లీలో తనకు ఇంకా ఇల్లు కేటాయించలేదని.. హౌస్ కమిటీ ఛైర్మన్ సీఆర్ పాటిల్ తో మాట్లాడటానికి బీజేపీ కార్యాలయానికి వెళ్లానన్నారు. ఆయన పార్టీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి..అక్కడకు వెళ్లానని చెప్పుకొచ్చారు. చిన్న ఇల్లు కేటాయిస్తానని చెబుతుంతే..తాను ఒక పార్లమెంట్ స్థాయీ సంఘానికి ఛైర్మన్ కావటంతో.. పెద్ద ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేసానని చెప్పుకొచ్చారు. అదే విధంగా బీజేపీ కార్యాలయ కార్యదర్శి బాల సుబ్రమణ్యం తెలుగు వ్యక్తి కావటంతో ఆయనతో కొద్ది సేపు సాధారణ పలకరింపులు జరిగాయని రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.