రాజీనామాలపై మే 29న స్పీకర్తో భేటీ కానున్న వైసీపీ ఎంపీలు
Recommended Video
అమరావతి: ఏపీ రాష్ఠ్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో తమ పదవులకు రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలతో భేటీ కావాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు మే 29వ తేదిన తనను కలవాలని స్పీకర్ సుమిత్రా మహజన్ వైసీపీ ఎంపీలకు లేఖలను పంపారు. రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలతో చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో ఏపీకి చెందిన టిడిపి, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు రకాలుగా ఆందోళనలు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజున వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలను సమర్పించారు.
పార్లమెంట్ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు స్పీకర్ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్ను కోరారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే.
మే 1వ , తేదిన కలవాలని స్పీకర్ కార్యాలయం నుండి తొలుత వైసీపీ ఎంపీలకు సమాచారం అందింది. ఆ తర్వాత మే 7వ, తేదిన కూడ ఇదే రకమైన సమాచారం వచ్చింది. అయితే చివరకు ఏ రోజున రావాలని ఆహ్వానం పంపితే ఆ రోజున వస్తామని వైసీపీ ఎంపీలు స్పీకర్ కార్యాలయానికి సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారం మేరకు వైసీపీ ఎంపీలను మే 29వ తేదిన రావాలని స్పీకర్ కార్యాలయం నుండి సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు స్పీకర్ సుమిత్రా మహజన్ తో వైసీపీ ఎంపీలు సమావేశం కానున్నారు.
రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని వైసీపీ ఎంపీలు అభిప్రాయంతో ఉన్నారు. తమ రాజీనామాలను ఆమోదించుకొని ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును కోరాలని వైసీపీ భావిస్తోంది.ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడం ద్వారా టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టాలని వైసీపీ బావిస్తోంది.