రఘురామపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు: విజయసాయిరెడ్డి
గత కొద్ది రోజులుగా పార్టీలో వివాదాస్పదంగా మారిన ఎంపీ రఘురామకృష్ణం రాజుపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. రఘురామకృష్ణం రాజుపై వేటు వేయాలని ఎంపీల బృందం స్పీకర్ను కలిసి పిటిషన్ అందజేసింది. 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీపై ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. వైసీపీలోనే ఉంటూ విపక్షంలా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని చెప్పారు. రఘురామకృష్ణం రాజుపై చర్యలు తీసుకుంటామని తమకు స్పీకర్ హామీ ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.
రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయండి
రఘురామకృష్ణం రాజు పార్టీలో ఉంటూ ఇతర పార్టీలతో మంతనాలు జరిపారని చెప్పిన విజయసాయిరెడ్డి బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రఘురామకృష్ణంరాజు ప్రజాస్వామ్యాన్ని కూలదోసేలా వ్యవహరించారని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీపై వ్యతిరేక చర్యలకు పాల్పడినందునే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరామని విజయసాయిరెడ్డి వివరించారు. ఆర్టికల్ 2 ప్రకారం రఘురామపై వేటు వేయాలని స్పీకర్ను కోరినట్లు చెప్పిన విజయసాయిరెడ్డి... పూర్తిగా క్రమశిక్షణ లేకుండా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వపక్షంలో ఉంటూ విపక్షంలా..
రఘురామకృష్ణం రాజు వినియోగించిన పదజాలం కూడా చాలా అసభ్యంగా ఉందని అన్నారు. అదేసమయంలో వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా విమర్శలు చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షంలా వ్యవహరించడాన్ని క్రమశిక్షణ చర్యలకింద రఘురామకృష్ణం రాజుపై యాక్షన్ తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. రఘురామకృష్ణం రాజు నైతిక విలువలు లేకుండా వ్యవహరించారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఊహాజనిత విషయాలని ఊహించుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మనసా వాచా ఆయన వైసీపీతో లేరని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. ఇక ఆయన ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదని విజయసాయిరెడ్డి అన్నారు.
రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి
రఘురామకృష్ణం రాజు తొలి సారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఆయనకు సముచిత స్థానం కల్పించామని మరో ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. సీఎం జగన్ రఘురామకృష్ణంరాజుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు మిథున్ రెడ్డి. టీటీడీ భూములపై ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అదే సమయంలో టీటీడీ ఛైర్మెన్ లేదా ఈఓలతో రఘురామ చర్చించి ఉంటే బాగుండేదని మిథున్ రెడ్డి చెప్పారు. కానీ అవేమీ చేయకుండా నేరుగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ఎంపీలు కోరారు.
Recommended Video
రఘురామ కృష్ణం రాజువి కుంటిసాకులు
ఇక రఘురామ కృష్ణంరాజు కుంటి సాకులు మానుకోవాలని మరో ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఇక ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న ఇంగ్లీష్ మీడియం విద్యపై కూడా రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారని గుర్తుచేసిన ఎంపీ మార్గాని భరత్.. తన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి కానీ బడుగు బలహీనవర్గాలవారు ఇంగ్లీష్ మీడియంలో చదవక్కర్లేదా అని ప్రశ్నించారు. ఇక వైయస్, జగన్ ఫోటోలతో తాను గెలవలేదని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారని దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ఎవరి ఫోటోకు విలువుందో అర్థమవుతుందని మరో ఎంపీ అన్నారు. రఘురామ కృష్ణం రాజుకు నిజంగానే ఆ సత్త ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి గెలవాలని సవాల్ చేశారు ఎంపీలు.