కన్నడంలో అనర్గళంగా వైసీపీ ఎంపీ: ప్రశంసించిన సదానంద గౌడ: ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి సమక్షంలో
మచిలీపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి తన భాషా ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ సమక్షంలో అనర్గళంగా కన్నడంలో మాట్లాడారు. సుమారు రెండు నిమిషాల పాటు ఆయన ప్రసంగం కన్నడంలోనే కొనసాగింది. కేంద్రమంత్రి సదానంద గౌడ కన్నడిగుడు. అందుకే- ఆయన సమక్షంలో తన కన్నడ భాషా ప్రావీణ్యాన్ని చాటారాయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రం జలకళను సంతరించుకుందని బాలశౌరి చెప్పుకొచ్చారు.
సీపెట్ ను ప్రారంభించిన సదానంద
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సదానంద గౌడ సంయుక్తంగా ప్రారంభించారు. ఉదయం 11.00 గంటలకు సదానందగౌడతో కలసి వైఎస్ జగన్ సీపెట్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. సూరంపల్లిలో 12 ఎకరాల విస్తీర్ణంలో సీపెట్ భవనాన్ని నిర్మించారు. దీనికోసం 50 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ భవనం నిర్మితమైంది.
రాష్ట్రానికి భారీగా సాయం..
ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మాట్లాడారు.. ఈ సందర్బంగా నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామని, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించడానికి చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. కేంద్ర మంత్రి సదానంద గౌడ మాట్లాడారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోసం పలు కేంద్ర పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఏపీ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉదారంగా వ్యవహరిస్తున్నారని సదానంద గౌడ చెప్పారు. విభజన హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాతే..
ఈ సందర్భంగా వల్లభనేని బాలశౌరి మట్లాడారు. ఆయన ప్రసంగంలో దాదాపు సగం భాగం కన్నడంలో కొనసాగింది. సదానంద గౌడ కర్ణాటకకు చెందిన నాయకుడు కావడం వల్లే బాలశౌరి ఆయనకు అర్థం అయ్యేలా కన్నడలో ప్రసంగించారు. సదానంద గౌడను ఉద్దేశించి కన్నడంలో మాట్లాడుతూ- వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రం జలకళను సంతరించుకుందని అన్నారు. రాష్ట్రంలో ఇది వరకు ఏ ఒక్క సీజన్ లో కూడా కురవని భారీ వర్షాలు ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్నాయని, మరో మూడేళ్ల పాటు రైతులకు నీటి కొరత అనేదే ఉండదని అన్నారు.
ప్రాజెక్టుల నిండా జలకళ
గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ నిండని పులిచింతల సహా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయని అన్నారు. శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్ వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులే కాకుండా, సోమశిల, మైలవరం, గండికోట వంటి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ వరద నీటితో పొంగి పొర్లుతున్నాయని, ప్రాజెక్టులన్నీ నిండిన తరువాత కూడా ఈ సీజన్ లో 650 టీఎంసీల మేర నీరు సముద్రంలోకి కలిసిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాలశౌరి కన్నడంలో కేంద్రమంత్రిని కోరారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ సదానంద గౌడ ఆసక్తిగా వింటూ కనిపించారు. అనంతరం బాటా మాట్లాడారంటూ బాలశౌరిని ప్రశంసించారు.