టిటిడి నగల వివాదంపై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ వరప్రసాద్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడును డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఏపీ సీఎం ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. టిటిడిపి వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. టిటిడిలో చోటు చేసుకొంటున్న అన్యాయాలను ప్రశ్నించిన ప్రధాన అర్చకుడు రమణదీక్షితులను టిటిడి నుండి తొలగించడం అన్యాయమని ఆయన చెప్పారు.
ఆరోపణలు చేసిన వారికి చట్టప్రకారంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని ఆయన ఆరోపించారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమల వెంకటేశ్వరస్వామి నగలపై జరుగుతున్న వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయమై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. అందుకే సీబీఐ విచారణ జరిపిస్తే టిటిడిలో అసలు ఏం జరిగిందో తేలుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
టిటిడి ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు ఇటీవల కాలంలో టిటిడిలో అక్రమాలు చోటు చేసుకొంటున్నాయని పలు ఆరోపణలను చేశారు. టిటిడికి చెందిన పింక్ డైమండ్ కన్పించకుండా పోయిందని కూడ ఆయన బయటపెట్టారు. టిటిడిలో చోటు చేసుకొంటున్న వ్యవహరాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడ కలిసి టిటిడి విషయాలపై ఫిర్యాదు చేశారు.
అయితే టిటిడి నగలన్నీ భద్రంగానే ఉన్నాయని ఈవో సింఘాల్ ప్రకటించారు. అంతేకాదు ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.