హఠాత్తుగా విజయసాయిరెడ్డి పాదయాత్ర ఎందుకు?...వైసిపిలో ఏం జరుగుతోంది?...
విశాఖపట్టణం:ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైసీపీ నేత, రాజ్యసభ ఎంపి విజయ్ సాయిరెడ్డి నేడు విశాఖపట్టణం నుంచి సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని అగనంపూడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతం అయిన ఉత్తరాంధ్ర అభివృద్దికి కృషి చేస్తామని ప్రకటించారు.
మరోవైపు ఒకవైపు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరిట 150 రోజులుగా పాదయాత్ర కొనసాగిస్తుండగా హఠాత్తుగా ఆ పార్టీలో నంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా పాదయాత్రకు పూనుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా అయితే జగన్ ఏకకాలంలో పార్టీలోని మరో ప్రముఖ వ్యక్తితో తనకు సమాంతరంగా మరో చోట పాదయాత్రకు అనుమతి ఇవ్వరు. అలాంటిది విజయసాయి రెడ్డికి ఎలా అనుమతిచ్చారు?...దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేక మరేదైనా కారణం ఉందా?...ఇలా రాజకీయంగా అనేక ప్రశ్నలకు తావిస్తూ విజయ్ సాయిరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించేశారు.
అయితే విజయ్ సాయి రెడ్డి పాదయాత్రకు కారణాలు ఏమై ఉండొచ్చనే విషయం తెలుసుకునేముందు విజయ్ సాయిరెడ్డి పాదయాత్ర వివరాలు తెలుసుకుందాం. మే 2న అగనంపూడి నుంచి పాదయాత్ర ప్రారంభమై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 72 వార్డుల్లో 10 రోజుల పాటు, అలాగే ఉత్తరాంధ్రలోని 6 నియోజకవర్గాల్లో 180 కిలోమీటర్లు ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. ఇక విశాఖలో తన పాదయాత్ర ప్రారంభం సందర్భంగా వైసిపి నేత విజయ్ సాయి రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం...ముందుగా వెనుకబడిన ప్రాంతం అయిన ఉత్తరాంధ్ర అభివృద్దికి కృషి చేస్తామని చెప్పిన ఆయన తన పాదయాత్రలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకుంటానని చెప్పారు. రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులను సత్వరం అమలు చేసి ప్రజలకు దగ్గర అవుతామని అన్నారు. మూడు దశాబ్దాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని అభిలషించారు.
ఇక విజయసాయిరెడ్డి పాదయాత్ర ఆరంభించడానిక కారణాలపై రాజకీయ పరిశీలకుల అభిప్రాయాలు ఇవి. జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్ర కు చేరుకోవడానికి ఇంకా చాలా సమయం ఉండటం, పార్టీలో చేరేందుకు ఈ ప్రాంతం నుంచి ఎక్కువమంది స్టేచర్ ఉన్ననేతలు ఆసక్తి చూపుతుండటం, ఎవరైతే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారో, ఆ మేరకు తమ ఆసక్తిని వ్యక్తీకరిస్తున్నారో వారిని టిడిపి వెంటనే అప్రోచ్ అయ్యి వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేయడం, కారణాలేమైనా కావచ్చు పార్టీలో చేరాలనుకుని మళ్లీ మనస్సు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వకుండా ఆసక్తి కనబర్చిన వారిని విజయ్ సాయి సమక్షంలోనే పార్టీలో చేర్చుకుంటూ ముందుకు పోవాలని వైసిపి తీసుకున్న నిర్ణయం మేరకు విజయ్ సాయిరెడ్డి ఇలా హఠాత్తుగా పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
ఇటీవలి కాలంలో వివిధ పార్టీల్లోని పలువురు ఉత్తరాంధ్ర నేతలు వైసిపిలో చేరేందుకు ఆసక్తి వ్యక్తీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు ఇప్పటికే జగన్ సమక్షంలో వైసిపిలో చేరగా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తాను వైసిపిలో చేరే ముహుర్తాన్ని ప్రకటించారు. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా జగన్ పాదయాత్ర తమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిజెపి ఎమ్మల్యే వైసిపికి, జగన్ కు అనుకూలంగా రోజుకో సంచలనం ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే తమ పార్టీ తరుపున గెలిచి తమకు గట్టి ఝలక్ ఇచ్చిన గిడ్డి ఈశ్వరీకి సరైన సమాధానం చెప్పే ఉద్దేశ్యంతో చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. సో...ఈ కారణాలన్నింటి రీత్యా జగన్ పాదయాత్ర ఈ ప్రాంతానికి చేరేలోపు తన వంతు తోడ్పాటుగా విజయ్ సాయి రెడ్డి రంగంలోకి దిగినట్లు, వైసిపి వ్యూహకర్తలు, అధినేత జగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విజయ్ సాయి రెడ్డి పాదయాత్రతో హఠాత్తుగా ప్రత్యక్ష కార్యచరణకు దిగడం వెనుక మారో కారణం కూడా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో తన వ్యూహాలతో టిడిపిని చిత్తుచేసిన విజయ్ సాయి రెడ్డిని మరో కారణంతో కూడా ఆ పార్టీ అధినాయకత్వం రంగంలోకి దింపి ఉండవచ్చని అంటున్నారు. అదేమిటంటే...రాష్ట్రంలో హఠాత్తుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఊహించని పర్యవసానాల కారణంగా ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చని...అదే జరిగితే జగన్ ఉత్తరాంధ్ర వరకు పాదయాత్ర జరిపే అవకాశం కూడా ఉండక పోవచ్చని, అలాంటిది ఏదైనా జరిగితే ఆ ప్రాంతవాసులకు వైసిపి వాణి వినిపించకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ లోటు జరగకుండా ముందు జాగ్రత్తగా విజయ్ సాయిరెడ్డిని వైసిపి రంగంలోకి దించిఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.