మళ్లీ జూలువిదిల్చిన వైసీపీ విజయసాయి.. సంచలన హెచ్చరిక.. స్ట్రా వేసుకుని నెత్తురు తాగారంటూ..
అధికార వైసీపీలో ముఖ్యమంత్రి వైస్ జగన్ తర్వాత నంబర్ 2గా కొనసాగుతోన్న ఎంపీ విజయసాయి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై దర్యాప్తు కోరుతూ ఎంపీ చేసిన ఫిర్యాదుతో డొంకంతా కదలిలిన నేపథ్యంలో ఈసారి ఎవరు చిక్కుల్లో పడతారనేది చర్చనీయాంశమైంది. తాజా ఫిర్యాదు వ్యవహారంతోపాటు విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై టీడీపీ విమర్శలకు ఆయన సంచలనరీతిలో సమాధానాలిచ్చారు.
Recommended Video
అసభ్య పదజాలంతో..
విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి విశాఖకు ప్రయాణించిన సందర్భంలో ఎంపీ విజయసాయిని దారుణంగా అవమానించారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఎంపీ కారు దిగిపోవడంపై వైసీపీ అధికారికంగా వివరణ ఇచ్చినా ప్రచారం మాత్రం ఆగలేదు. దీంతోపాటు చాలాకాలంగా తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి అసభ్య పదజాలంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటికి సంబంధించిన ఆధారాలతో సహా ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని విజయసాయి ఆదివారం వెల్లడించారు.
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా..
‘‘నాపై తప్పుడు ప్రచారం చేస్తోన్న సోషల్ మీడియా ఫేక్ గ్యాంగ్లకు ఇదే నా హెచ్చరిక.. మీ ఆగడాలపై నేనిచ్చిన ఫిర్యాదుమేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. అందరినీ బుక్ చేసి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధముతోంది. నాపై తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లతోపాటు అత్యుత్సాహంగా వాటిని షేర్ చేసేవాళ్లపైనా కఠిన చర్యలు తప్పవు. అలాంటి వారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నా పోలీసులు వలపన్ని పట్టుకుంటారు. కేసులు, అరెస్ట్ల నుంచి మీరు తప్పించుకోలేరు..''అని విజయసాయి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
స్టెరీన్ గ్యాస్ అంతుపట్టని జ్ఞాని..
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఎల్జీ కంపెనీతో సీఎం జగన్ కుమ్మక్కయ్యారని, అడ్డగోలుగా విస్తరణకు అనుమతులు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రతిపక్షం ఆరోపించింది. స్టెరీన్ గ్యాస్ పీల్చి జనం చనిపోవడమేంటో అంతుచిక్కడంలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు వాపోయారు.
ఈ విమర్శలకు ఎంపీ విజయసాయి తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. కండిషన్ అదుపు తప్పుతోందని, ఇక చంద్రబాబును గొలుసులతో కట్టేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. ‘‘మొన్న కరోనా వైరస్ కు చికిత్స చేయడానికి ఇక్కడి డాక్టర్లకేం తెలుసని పేలాడు. స్టెరీన్ గ్యాస్ గురించి జ్ఞానినైన నాకే అంతుపట్టడంలేదు.. ఇక ఐఏఎస్ అధికారులకు ఏం తెలుస్తుంది? అని అంటున్నాడు. విశాఖ బాధితుల ట్రీట్మెంటుకు బయటి నుంచి నిపుణులను రప్పించాలని ఇష్టమొచ్చినట్లు వాగుతున్నాడు''అని బాబుపై ఎంపీ నిప్పులు చెరిగారు.
భౌతిక శాస్త్రవేత్త.. నెత్తురు తాగారు..
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీపై విమర్శలు చేసిన చంద్రబాబు.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడి ఆధ్వర్యంలో కమిటీ వేయడం హాస్యాస్పదంగా ఉందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘ఐఏఎస్ల కమిటీలో నిపుణులు లేరన్న చంద్రబాబు.. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అచ్చెన్నాయుడు నేతృత్వంలో కమిటీ వేయటం అంటే... క్యా బాత్ హై''అని ట్వీట్ చేశారు. కరోనా, గ్యాస్ లీకేజీ.. విపత్తులు ఎలాంటివైనా సరే గ్రామస్థాయిలోనే పోరాడేందుకు వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పారు. బాబు జమానాలో జనం జేబులు కొట్టడమే జీవిత లక్ష్యంగా ఉండేదని, జన్మభూమి కమిటీల ద్వారా స్ట్రా వేసుకుని మరీ ప్రజల నెత్తురు తాగారని, ఇప్పటి జనగ్ ఏలుబడిలో మాత్రం ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, జనంకోసం రక్తం ధారపోయడానికీ వెనకాడకుండా గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నారని విజయసాయి చెప్పారు.