పంచాయతీ పోరులో సాయిరెడ్డిని ఇరికించిన నిమ్మగడ్డ-చంద్రభక్తి అంటూ వైసీపీ ఎంపీ కౌంటర్లు
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణపై తాజాగా సీఎస్కు రాసిన లేఖలో ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని పేరెత్తకుండానే పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్నికలు ఏప్రిల్లో నిర్వహిస్తామంటూ ప్రభుత్వంలో ఓ కీలక వ్యక్తి చెబుతున్నారంటూ నిమ్మగడ్డ సీఎస్కు రాసిన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిమ్మగడ్డ సీఎస్కు రాసిన లేఖతో తన పేరు ప్రస్తావించడంపై మూడు రోజులుగా స్పందించని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఇవాళ మాత్రం ఆయనకు కౌంటర్గా ఓ ట్వీట్ చేశారు. ఇందులో సీఎస్ వద్దంటున్నా, ఉద్యోగ సంఘాలు నో అంటున్నా, వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైనా, ఎవరి ప్రయోజనాల కోసం ఈ పంచాయతీ నిమ్మగడ్డా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపమని సుప్రీంకోర్టు చెబితే నువ్వు చేసే నిర్వాకం ఇదా అంటూ ఆయన్ను సాయిరెడ్డి ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా చంద్రబాబునూ ఇందులోకి లాగారు.
రాష్ట్రంలో స్ధానిక ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ చంద్రభక్తి చాటుకున్నావే అంటూ నిమ్మగడ్డకు సాయిరెడ్డి కౌంటర్లు వేశారు. నిమ్మగడ్డ జారీ చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఏకపక్షంగా పేర్కొంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీన్ని ఇవాళ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ కూడా జరపనున్న తరుణంలో సాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిమ్మగడ్డను ఉద్దేశించి గతంలోనూ పలు ట్వీట్లు, తీవ్ర వ్యాఖ్యలు చేసిన సాయిరెడ్డి.. తనకు సెక్యూరిటీ కోరుతూ కేంద్రానికి ఆయన రాసిన లేఖపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.