ఇళ్ల స్ధలాల పేరుతో బీజేపీలో సాయిరెడ్డి చిచ్చు- బాబు చీకటి మిత్రులంటూ వారిని కార్నర్...
ఏపీలో కరోనా కారణంగా పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమం వరుసగా నాలుగోసారి వాయిదా పడగా.. దీని పేరుతో సాగుతున్న రాజకీయాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పేదలకు ఇళ్ల స్ధలాల మాటేమో కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఇదో ప్రచారాస్త్రంగా మారిపోయింది. ఇప్పటికే ఇళ్ల స్ధలాల పంపిణీలో అధికార పక్షం అక్రమాలను విపక్ష టీడీపీ ఎక్కడికక్కడ బయటపెడుతుండగా.. తాజాగా వైసీపీ దానికి కౌంటర్లిచ్చే పనిలో ఉంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు దీనిపై స్పందించడంతో ఇదే అదనుగా వైసీపీ ఎంపీ సాయిరెడ్డి రంగంలోకి దిగిపోయారు.
చంద్రబాబు మైండ్ డీజనరేట్.. గొలుసులు రెడీ: ఊహించిందే.. ఈ ఘనత దక్కకుండా: ఏది నిజం?: సాయిరెడ్డి
ఇళ్ల స్ధలాల రాజకీయం..
ఏపీలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నిర్ణయించిందో కానీ దాని అమల్లో ఎక్కడలేని ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా కారణంగా వివిధ సందర్భాల్లో నాలుగు సార్లు ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 15న ఇళ్ల స్ధలాల పంపిణీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈసారైనా ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా అని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతలోపే అధికార వైసీపీ, టీడీపీ మధ్య ఇళ్ల స్ధలాల పేరుతో రాజకీయం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం చేప్టటిన ఇళ్లస్ధలాల పంపిణీలో అక్రమాలను వెలికితీసే కార్యక్రమంలో టీడీపీ బిజీగా ఉండగా... వైసీపీ దానికి కౌంటర్లూ గట్టిగానే ఇస్తోంది. అయితే తాజాగా ఇందులో బీజేపీ కూడా వచ్చి చేరింది.
టీడీపీకి సోము కౌంటర్ తో..
ఇళ్ల స్ధలాల పంపిణీలో అక్రమాలంటూ మొదలుపెట్టిన టీడీపీ ... ఆ తర్వాత తమ హయాంలో నిర్మాణమైన ఇళ్లను పేదలకు ఎందుకు పంపిణీ చేయరంటూ మరో గొడవ మొదలుపెట్టింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనికి కౌంటర్ ఇవ్వాలో తెలియక వైసీపీ మథన పడుతుంటే మేమున్నామంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రంగంలోకి దిగారు. పూర్తి కాని ఇళ్లను జనానికి పంపిణీ చేయమని ఎలా అడుగుతారంటూ టీడీపీని ఆయన ప్రశ్నించారు. దీంతో వైసీపీకి భారీ ఊరట లభించినట్లయింది. అప్పటివరకూ ఈ వ్యవహారంలో సరైన కౌంటర్ కోసం వెతుతుకున్న వైసీపీకి సోము వీర్రాజు తన వ్యాఖ్యలతో ఊతమిచ్చారు.
సోము కౌంటర్ ను వాడుకుంటూ సాయిరెడ్డి...
అప్పటివరకూ టీడీపీ నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయమనడంపై మాట్లాడని విజయ సాయిరెడ్డి సోమువీర్రాజు వ్యాఖ్యల తర్వాత స్వరం పెంచారు. ఈ వివాదంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కూడా లాగారు. పూర్తి కాని ఇళ్లను ఎలా ఇవ్వాలంటూ సోము ప్రశ్నిస్తుంటే బాబు చీకటి మిత్రలు నోరు మెదపడం లేదంటూ కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం బీజేపీలోనూ కలకలం రేపుతోంది. సోమువీర్రాజు టీడీపీకి ఇచ్చిన కౌంటర్ వైసీపీకి మద్దతుగా మారడంతో పాటు బీజేపీలో చిచ్చుకూ కారణమవుతుండటంతో ఆ పార్టీ నేతలు దీనిపై ఆగ్రహంగా ఉన్నారు. ఇలా సాయిరెడ్డి తన ట్వీట్ తో సోమువీర్రాజును ఇరికించడంతో పాటు బీజేపీలో చిచ్చు రేపారని విశ్లేషకులు భావిస్తున్నారు.